1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 3 ఆగస్టు 2021 (20:07 IST)

ప‌నిలేని చంద్ర‌బాబు ఎలాగైనా రావాాలని ఎత్తులు వేస్తున్నారు: సజ్జల

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడుకు, ఆయ‌న పార్టీకి ప‌నిలేద‌ని అందుకే ప‌నికి మాలిన ధ‌ర్నాలు చేప‌డుతున్నార‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పనీ పాట లేని అయ్యవారు ఏం చేస్తున్నారు అంటే, ఒలకబోసి ఎత్తుకుంటున్నారు అనే సామెత చంద్రబాబునాయుడుకి, ఆయన పార్టీకి వర్తిస్తుంద‌న్నారు.

విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, ఈనెల 7న పెట్రో ధరల మీద ధర్నా చేస్తార‌ట‌... వారి ఆందోళన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కోవిడ్‌ సాకు చూపి కొద్ది మంది మాత్రమే రావడం, ఫోటోలు తీసుకోవడం, తమకు సంబంధించిన పత్రికల్లో వేసుకోవడం, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించడం. ఇవన్నీ ప్రజలకు తెలుసు’ అని స‌జ్జ‌ల ఎద్దేవా చేశారు.
 
‘పెట్రోల్‌ ధరలు కానీ, డీజిల్‌ ధరలు కానీ జగన్‌ ప్రభుత్వం పెంచలేద‌ని, అవి పెంచింది సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వమే అని, అంతే కాకుండా ఆ కారణం చూపి ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచిన పెద్దమనిషి, ఇవాళ పెట్రో ధరలకు నిరసన వ్యక్తం చేస్తామని చెబుతున్నార‌ని విమ‌ర్శించారు. 
 
‘2015 ఫిబ్రవరిలో పెట్రోల్, డీజిల్‌ మీద ఉన్న వ్యాట్‌కు అదనంగా లీటరుకు రూ.4 చొప్పున అదనపు పన్ను వేసింది చంద్రబాబు ప్రభుత్వమే. ఆ మేరకు ఆరోజు జీఓ కూడా జారీ చేశారు. అలా ఎందుకు పెంచారన్న దానికి కారణం కూడా చూపలేదు. ఆ రోజు రూ.4 ఎందుకు అదనంగా పెంచారని అందరూ అడిగినా, ప్రభుత్వం స్పందించలేదు. ప్రజలు నిలదీసినా సమాధానం లేదు. ఆరోజు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి పట్టించుకోలేదు’.
 
‘2014 జూన్‌లో రూ.73 ఉన్న పెట్రోల్‌ ధర ఏపీలో 2018 సెప్టెంబరు నాటికే రూ.86 దాటింది. డీజిల్‌ అయితే రూ.62 నుంచి రూ.80 కి పెరిగింది. ఇదంతా 2018 సెప్టెంబరు నాటికే జరిగింది. ఆ తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను ఎక్కడా తగ్గించింది లేదు. ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2019, ఏప్రిల్‌ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోల్‌ ధర ఏకంగా రూ.87.24 కు చేరింది. ఆ విధంగా దాదాపు రూ.100 కు చేరువయింద‌ని స‌జ్జ‌ల వివ‌ర‌ణ ఇచ్చారు.
 
‘ఈ మధ్య కాలంలో లీటరు పెట్రోల్‌ మీద కేవలం ఒక్క రూపాయి పెంచిన విషయం అందరికీ తెలిసిందే. అది కూడా ఎందుకు వేశామన్నది చెప్పాలి. చందబాబు అయిదేళ్ల హయాంలో రాష్ట్రంలో రహదారులను పట్టించుకున్న పాపాన పోలేదు. అవి గుంతలు పడ్డా, గోతులు పడ్డా ఏరోజూ ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి నోరెత్తలేదు. గత రెండేళ్లుగా భారీగా వర్షాలు పడ్డాయి. దాంతో రోడ్లు మరింత దెబ్బ తిన్నాయి. ఆ రోడ్లను ఈ అక్టోబరు నుంచి మరమ్మతు చేయబోతున్నారు. ఆ ఆర్థిక వనరుల కోసమే ఆ నిర్ణయమ‌న్నారు...స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.
 
‘అయినా సిగ్గు ఎగ్గూ లేకుండా ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తామంటున్నారు. మీకు రెండు పత్రికలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, ఏం చేసినా ప్రజలు పట్టించుకోరని అనుకుంటున్నారా. వర్షాల సమయంలో రోడ్లు బాగు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి అక్టోబరు నుంచి మరమ్మతులు జరుగుతాయి. దాని కోసమే ఏపీఆర్‌డీసీ గట్టిగా ప్రయత్నం చేస్తోంది.

బాబు హయాంలో రోడ్లు బాగోకపోయినా మీకు అవి అందంగా కనిపించేవి. సింగారంగా కనిపించేవి. మీకు నచ్చని ముఖ్యమంత్రి ఉంటే అవే రోడ్లు మీకు వికారంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆరోజు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. ఇవాళ ఆయన అధికారంలో లేడు. ఎలాగైనా ఆయనను అధికారంలోకి తేవాలన్నది ఆ మీడియా ఆరాటం అని ఎద్దేవా చేశారు.