గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (07:50 IST)

బీజేపీకి షాక్​- ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా 'బీహార్'​ తీర్మానం

ఎన్​ఆర్​సీ విషయంలో బీజేపీకి అనూహ్య పరిణామం ఎదురైంది. ఎన్​డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రం​లోనే జాతీయ పౌర పట్టికను వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేసింది.

ఎన్​పీఆర్​ అమలు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది బీహార్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక-ఎన్​ఆర్​సీ అమలును వ్యతిరేకిస్తూ బీహార్​ శాసనసభ తీర్మానం చేసింది.

త్వరలో అమలు కావాల్సిన జాతీయ జనాభా పట్టిక-ఎన్​పీఆర్​ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్​పీఆర్​ను మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన పద్ధతిలో కాక యూపీఏ హయాం(2010) నాటి విధానంలో స్వల్ప మార్పులతో రూపొందించాలని తీర్మానించింది.

బీజేపీకి ఎదురుదెబ్బ! దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీపై కొంతకాలంగా తీవ్ర దుమారం రేగుతోంది. బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల శాసనసభలు ఇప్పటికే ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి.

అయితే... ఎన్​డీఏ(జేడీయూ-బీజేపీ) అధికారంలో ఉన్న బీహార్​లోనే ఇలాంటి తీర్మానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీహార్​లో ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్​ఆర్​సీ విషయంలో నితీశ్​ ప్రభుత్వం మిత్రపక్షం(బీజేపీ) వైఖరికి భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఎన్​పీఆర్​ విషయంలోనూ స్వయంగా నితీశ్​ కుమార్​ అభ్యంతరాలు లేవనెత్తడం గమనార్హం.

కొత్త ఎన్​పీఆర్​ దరఖాస్తుల్లోని వివాదాస్పద నిబంధనల్ని తొలిగించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు శాసనసభలో చర్చ సందర్భంగా చెప్పారు నితీశ్.