శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 ఆగస్టు 2021 (15:36 IST)

డబ్బు కోసం కన్నబిడ్డను కిడ్నాప్ చేసిన తాగుబోతు తండ్రి టెక్కీ

ప్రకాశం జిల్లాలలో వ్యసనాలకు బానిసైన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తండ్రి డబ్బుకోసం కన్నబిడ్డనే కిడ్నాప్ చేశాడు. చివరకు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆ బిడ్డను పోలీసులు సురక్షితంగా రక్షించారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలంలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన పల్నాటి రామకృష్ణారెడ్డి - ఉమ దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 
 
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఏడాదిగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న రామకృష్ణారెడ్డి జూదం, మద్యం వంటి వ్యసనాలకు దూరమయ్యాడు. ఈ క్రమంలో రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో వారి నుంచి ఒత్తిడి పెరిగింది. 
 
దీంతో డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను అడిగితే వారు నిరాకరించారు. గత నెల 28న తన కుమారుడినే అపహరించి కందుకూరులోని ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి భార్య ఉమకు ఫోన్ చేసి కుమారుడు తన దగ్గరే ఉన్నాడని, తాను అడిగిన రూ.20 లక్షలు ఇవ్వకుంటే చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. 
 
దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రామకృష్ణారెడ్డి లాడ్జిలో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి చెర నుంచి కుమారుడిని విడిపించి తల్లికి అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.