ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 25 మే 2021 (19:41 IST)

ఏడు తుఫానుల్లో 37 లక్షల ఎకరాల్లో పంట నష్టం, బీమా ఇస్తున్నది 15.15 లక్షల మంది రైతులకే

కరోనా సమయంలో రైతులను ఆదుకోవాల్సిన జగన్ రెడ్డి.. వందల కోట్ల రూపాయలు ప్రకటనలకు ఖర్చు చేస్తూ రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఉచిత పంటల బీమా పేరుతో ఇచ్చింది గోరంత.. ప్రచారం కొండంత. ప్రకటనలకు పెట్టే ఖర్చులో 10శాతం కూడా రైతులకు చెల్లించడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లోనూ అన్నీ అబద్ధాలు. ఒక ప్రకటనకు, మరో ప్రకటనకు సంబంధం లేదు. బూటకపు లెక్కలు చెబుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు.
 
2020 ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి సంభవించిన 7 తుఫాన్లలో 37 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైతులు రూ.15 వేల కోట్ల మేర పంట నష్టపోతే జగన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వబోతున్నామని చెప్పిన పరిహారం కేవలం 1820.23 కోట్లు మాత్రమే. 2018లో ఇప్పటికన్నా తక్కువ పంట దెబ్బతిన్నా చంద్రన్న ప్రభుత్వం పంట బీమా రూ.1,860 కోట్లు రైతులకు ఇచ్చింది. 5 ఏళ్లలో మొత్తం రూ.4007.59 కోట్లు టీడీపీ ప్రభుత్వం బీమా ఇచ్చింది. సుమారు 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది.
 
2020లో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకుండానే రూ.1,030 కోట్లు చెల్లించినట్లు జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. చెల్లించకుండానే చెల్లించినట్లు అబద్ధాలు చెప్పి రైతులకు ద్రోహం చేస్తున్నారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆర్టీఐ రుజువులు చూపారు. నేలపై కూర్చొని నిరసన తెలిపారు. దీంతో కంగుతున్న జగన్ రెడ్డి ఆ రోజు రాత్రి రూ.590 కోట్లు ప్రీమియం కోసం జీవో విడుదల చేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ ప్రకటనలో అన్నీ తప్పుడు లెక్కలు చెప్పారు. రైతులకు వేల కోట్ల రూపాయల సాయం చేస్తే రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఎందుకు నిలుస్తుంది?
 
ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపుల్లోనూ జగన్ రెడ్డి మోసం చేశారు. నివర్ తుఫాను వల్ల ఎకరానికి 30 వేలు నష్టం జరిగితే జగన్ రెడ్డి ఇన్ పుట్ సబ్సీడీ కింద ఇచ్చింది కేవలం రూ.5 వేలు మాత్రమే. నివర్ వల్ల 17.33 లక్షల హెక్టార్లలో పంట నష్ట జరిగితే కేవలం 5 లక్షల ఎకరాలకు మాత్రమే పరిహారం ఇచ్చారు. ఎకరా వరికి విపత్తుశాఖ రూ.15వేలు లెక్క వేయగా.. జగన్ రెడ్డి ఇచ్చింది రూ.4 వేలే. ప్రతిపక్షంలో ఉండగా ఎకరాకు రూ.30వేలు డిమాండ్ చేసిన జగన్ రెడ్డి.. ఇప్పుడు కేవలం రూ.5 వేలతోనే సరిపెట్టారు. ప్రకృతి విపత్తుల కింద నష్టపోయిన వివిధ పంటలకు చంద్రన్న ప్రభుత్వం నష్టపరిహారాన్ని సుమారు 50 శాతం నుంచి 100శాతం వరకు పెంచడం జరిగింది. జగన్ మాత్రం కేవలం 15శాతం పెంపునకే పరిమితం అయ్యారు.
 
రైతు భరోసా పేరుతోనూ మోసం చేశారు. రూ.13,500 ఏడాదికి చెల్లిస్తామని చెప్పి కేవలం రూ.7,500 మాత్రమే చెల్లిస్తున్నారు. ఏటా రైతు రూ.6వేలు నష్టపోతున్నారు. ఐదేళ్లలో రూ.30 వేలు నష్టపోతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉండి ఉంటే అన్నదాత సుఖీభవ కింద రూ.15వేలు వచ్చి ఉండేవి. రైతు సాయంలో కూడా కులాలు ఆపాదించిన చరిత్ర జగన్ రెడ్డిది. ఇప్పటికైనా మోసపూరిత విధానాలు విడనాడి కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలి.