1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2019 (21:37 IST)

ప్రాంతాల మధ్య చిచ్చు, అందుకే మూడు రాజధానులు: టీడీపీ

మ‌ంత్రిస్థాయిలో ఉన్నవ్యక్తులు కులరాజకీయాలు చేస్తూ, చాకచక్యంగా కావాలనే ప్రతిపక్షఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయించి, అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, అమరావతి ప్రాంతం ఒక సామాజికవర్గానికే పరిమితమంటూ దుష్ప్రచారం చేశారని  టీడీపీ అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.

బుధవారం ఆమె ఆత్మకూరులోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతమంతా ఒకసామాజికవర్గానిదేనన్నట్లు మాట్లాడిన మంత్రిబుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అసెంబ్లీలో కొన్నిపేర్లు చదివారని, ఆస్థాయిలో ఉన్నవ్యక్తికి అది తగదని ఆమె హితవుపలికారు.

రాజధాని ప్రాంతంలో 14కులాలున్నాయని, వారిలో 17శాతం రెడ్లుంటే, 14శాతం కమ్మవారున్నారని, మిగిలినవారంతా ఎస్సీ,ఎస్టీ,బీసీ లేనని, కేవలం ఒకకులం పేరు చెప్తూ, రాజధానిని నాశనం చేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతి ప్రాంతంలో అన్నివర్గాలు నివసిస్తున్నారంటూ సామాజికవర్గాల వారీగా కొన్నిపేర్లను చదివి వినిపించారు.

ఇలా చదువుతూపోతే, చాలామంది ఉంటారని, కొంచెంకూడా ఇంగిత జ్ఞానంలేకుండా, రాజధానిఅంశంలో  కులంకోణం ఎందుకు తీసుకొస్తున్నారో సదరు మంత్రే ఆలోచించుకోవాలన్నారు.  కాపులవనసమారాధనకు వెళ్లిన విజయ సాయిరెడ్డి, తనచర్యను సమర్థించుకుంటూ, తన సర్టిఫికెట్‌లో కాపు అనిఉంటుందని, కానీ తాను రెడ్డినని చెప్పినమాటను అనురాధ  ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఈ విధంగా కులరాజకీయాలు చేయడంతప్ప, వైసీపీ వారికి అభివృద్ధి పట్టడంలేదన్నారు. ప్రధాన పదవులన్నీ ఆ వర్గానివే.. 213 ప్రధానపోస్టులన్నీ రెడ్లకు కట్టబెట్టిన జగన్‌ సర్కారు , ఆయా పదవుల్లోఉన్న ఒక్కొక్కరికీ రూ.లక్షనుంచి రూ.4లక్షల వరకు జీతభత్యాలు  ఇస్తున్నమాట వాస్తవం కాదా అని అనురాధ ప్రశ్నించారు. నామినేటెడ్‌ పోస్టులన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామంటూ జీవోలు ఇచ్చిన ప్రభుత్వం, చేతల్లో మాత్రం ఆయావర్గాలకు తీరని అన్యాయం చేసిందన్నారు.
 
జగన్‌పిచ్చి పరాకాష్టకు చేరింది..
జగన్‌పిచ్చి పరాకాష్టకు చేరిందని, దాన్ని కుదర్చడంకోసం ఆయన్నెక్కడ చేర్చాలనే ఆలోచనలో ప్రజలున్నారని అనురాధ ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడితే, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, తన పబ్బం గడుపుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడని,  అందుకోసమే మూడురాజధానుల రాగం అందుకున్నాడని అమె తెలిపారు.

వైజాగ్‌లో జరిగిన భూబాగోతంపై సీబీఐ విచారణ జరపాలి..
గత 6నెలల్లో  వైజాగ్‌ కేంద్రంగా జరిగిన భూబాగోతంపై సీబీఐతో విచారణ జరిపించాలని పంచుమర్తి  కోరారు. ఎంతమంది సీపీనేతల బినామీపేర్లతో అక్కడ భూములుకొన్నారో, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ వివరాలన్నీ బయటపెట్టాలని ఆమె డిమాండ్‌చేశారు. స్వామీ జీల ఆశ్రమాల్లో ఉంటూ, వారిని అడ్డుపెట్టుకొని ఎన్ని స్థలాలను ఏవిధంగా ఆక్రమించా రో, ఆయా వివరాలన్నీ బయటకు రావాల్సి ఉందన్నారు.

ఈ భూకుంభకోణంపై తక్షణమే సీబీఐ విచారణజరపాలని, దీనిపై ఇదివరకే పత్రికల్లో అనేకకథనాలు వచ్చాయ ని, వైఎస్‌ తోడల్లుడు, జగన్‌ బాబాయి రుషికొండను అనకొండలా మింగేయడానికి  ప్రయత్నించాడంటూ, దానికి సంబంధించిన పత్రికాకథనాలను అనురాధ విలేకరులకు చూపించారు. అక్కడున్న ఓక్లబ్‌లో విజయసాయిరెడ్డి ఏమేంచేశారో..ఎవరిని బెదిరించా రో అందరికీ తెలుసునన్నారు.

ఓ పక్క ప్రభుత్వాధినేతగా ఉంటూ, వైజాగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పెట్టాలన్న నిర్ణయానికి జగన్‌ ఎందుకొచ్చాడో సమాధానం చెప్పాలన్నారు. జగన్మోహన్‌రెడ్డి రాజధానిపై గతంలో అనేకప్రగల్భాలు పలికాడన్న ఆమె, అమరావతిని ఏ రకంగా అభివృద్దిచేయాలో, ఏరకంగా ఉద్యోగావకాశాలు కల్పించాలో, ఏ రకంగా జీడీపీ పెంచాలో.. జిల్లాలవారీగా ఎలా పరిశ్రమలు ఏర్పాటుచేయాలో చెప్తూ జగన్‌  మాట్లాడిన వీడియోను విలేకరులకు ప్రదర్శించారు.

ఈ విధంగా మాట్లాడిన జగన్‌,  ముఖ్యమంత్రయ్యాక రూ.లక్షా50వేలకోట్ల పెట్టుబడులను ఎందుకు తరమికొట్టారని  అనురాధ నిలదీశారు. మల్లీనేషనల్‌కంపెనీలు తీసుకొస్తానన్న వ్యక్తి, రిలయన్స్‌, ఆదానీ, లులూ, ఒంగోలుపేపర్‌మిల్స్‌, 17 కియా అనుబంధపరిశ్రమలను ఎందుకు వెళ్లగొట్టాడో సమాధానం చెప్పాలన్నారు. స్మా సిటీమారిన వైజాగ్‌ అభివృద్ధికోసం వచ్చిన నిధులను కూడా మింగేసిన జగన్‌సర్కారు, ప్రాంతాలపై అభిమానముందని చెప్పడం సిగ్గుచేటన్నారు.

6నెలల్లో జగన్‌ప్రభుత్వం చేసినవాటిని ఆధారాలతో బయటపెడతామన్నారు. చంద్రబాబు నాయుడు, జగన్‌లా చేతులెత్తేయలేదు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా చంద్రబాబు నాయుడు రాజధానిలో 60శాతంపైగా పనులు పూర్తిచేశారని, జగన్‌కు చేతనైతే వాటన్నింటినీ పూర్తిచేయాలన్నారు. రాష్ట్రంలోటుబడ్జెట్‌లో  ఉన్నప్పటికీ, చంద్రబాబు 5.50లక్షల ఉద్యోగాలు సృష్టించారనీ, ప్రాజెక్టులనిర్మాణం చేపట్టి, మౌలిక వసతులు కల్పించారనీ, జగన్‌లాగా నిధులులేవంటూ చేతులెత్తేయలేదని అనురాధ స్పష్టంచేశారు. 
 
చంద్రబాబుపాలనలో, ఇప్పుడు జిల్లాలవారీగా జరిగిన అభివృద్ధిపై వైసీపీతో చర్చకు తాము సిద్ధమని, ఎవరువస్తారో రావాలని అనురాధ సవాల్‌ విసిరారు. జగన్‌ప్రభుత్వ మాటలు కోటలు దాటుతుంటే, చేతలు గడపకూడా దాటడంలేదన్న చంద్రబాబు మాటలు అక్షరసత్యాలని ఆమె స్పష్టంచేశారు.