శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (12:03 IST)

పెద్దలను ఎదిరించలేక పెళ్లి.. భర్తతో కాపురం చేయలేక ప్రియుడితో కలిసి ఆత్మహత్య...

తన మనసుకు నచ్చిన వ్యక్తిని ఓ యువతి నాలుగేళ్ళపాటు గాఢంగా ప్రేమించింది. కానీ ఎదిరించే ధైర్యం చేయలేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. కానీ మనసు చంపుకుని భర్తతో కాపురం చేయలేక పోయింది. ప్రియుడుతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని దేవరకద్ర మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భూత్పూర్ గ్రామానికి చెందిన కంప్లి మణెమ్మ, నర్సింహల కుమార్తె రామేశ్వరి (25), అదే గ్రామానికి చెందిన నాగరాజు (31) అనే వ్యక్తిని నాలుగేళ్ళుగా ప్రేమిస్తూ వచ్చింది. ఈ ప్రేమ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. పైగా, కుమార్తెకు మరో యువకుడుతో వివాహం జరిపించారు. 
 
ఇటు ప్రియుడుని మరచిపోలేక అటు మనస్సు చంపుకుని భర్తతో కాపురం చేయలేక వివాహమైన రెండు నెలలకే పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత రామేశ్వరి ప్రియుడితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో భర్తతో కాపురం చేయనని పుట్టింటిలోనే ఉండిపోయింది. కొన్ని నెలలు గడిచిన తర్వాత తల్లిదండ్రులు రామేశ్వరిని మెట్టినింటికి పంపాలనే ఆలోచనలో ఉన్నట్లు గుర్తించింది. 
 
ఈ క్రమంలో ఆమె బుధవారం రాత్రి ప్రియుడు నాగరాజుతో కలిసి గ్రామ సమీపంలోని మోతుకుంట చెరువు సమీపంలో నబీసాబ్‌ పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం వ్యవసాయ పొలాలకు వెళ్లే వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై రామేశ్వరి తండ్రి నర్సింహ భూత్పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.