గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (09:13 IST)

తిరుపతిలో లాక్డౌన్ పొడగింపు - సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు

కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గక పోవడంతో తిరుపతి పట్టణంలో అమల్లోవున్న లాక్డౌన్‌ను ఈనెలాఖరు వరకు పొడగిస్తూ నగర పాలక సంస్థ కమిషనరు గిరీష ఆదేశాలు జారీచేశారు. ఈ లాక్డౌన్ కారణంగా దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరిచివుంటాయని తెలిపారు. 
 
లాక్డౌన్ సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు. దుకాణదారులు నిర్దేశించిన సమయం తర్వాత దుకాణాలను తెరిచి ఉంచితే సీజ్‌చేసి, ట్రేడ్‌ లైసెన్స్‌ రద్దుచేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. 
 
మరోవైపు, చిత్తూరు జిల్లాలో కొత్త కరోనా కేసుల నమోదు సంఖ్యలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు 24 గంటల్లో 1198 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. ఒక రోజులో వైరస్‌ కేసులు వెయ్యి దాటడం ఇది ఐదోసారి. 
 
ఇందులో కేవలం ఆదివారం ఉదయం నుంచి రాత్రి దాకా.. 12 గంటల్లో 446 కేసులు నమోదయ్యాయి. వీటిలో తిరుపతిలో 160, చంద్రగిరిలో 62, నారాయణవనంలో 39, పుత్తూరులో 22, చిత్తూరులో 19, శ్రీకాళహస్తిలో 17, పుంగనూరు, బంగారుపాలెం మండలాల్లో 13 వంతున, జీడీనెల్లూరులో 12, తిరుపతి రూరల్‌, రేణిగుంట, నాగలాపురం మండలాల్లో 10 చొప్పున నమోదయ్యాయి. 
 
అలాగే, పిచ్చాటూరులో 9, మదనపల్లె, చిన్నగొట్టిగల్లు, శ్రీరంగరాజపురం, పెద్దమండ్యం మండలాల్లో 4 వంతున, నగరిలో 3, సత్యవేడు, తొట్టంబేడు, ఐరాల, పలమనేరు, బి.కొత్తకోట, నిండ్ర, బీఎన్‌ కండ్రిగ మండలాల్లో 2 చొప్పున, రొంపిచెర్ల, వరదయ్యపాలెం, వి.కోట, పీలేరు, కురబలకోట, పాకాల, పూతలపట్టు, రామసముద్రం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇతర జిల్లాలకు చెందిన కేసులు నాలుగున్నాయి. తాజా కేసులతో జిల్లాలో పాజిటివ్‌ కేసులు 25023కు చేరాయి. 
 
ఇకపోతే, శ్రీకాళహస్తికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఆదివారం రాత్రి వైద్య వర్గాలు విడుదల చేసిన పాజిటవ్‌ జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈయన 14వ తేదీన కరోనా పరీక్షలు చేసుకోగా ఫలితం ఆదివారం వచ్చింది. శ్రీకాళహస్తికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో... ఈ మాజీ ఎమ్మెల్యే కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కరోనా బారిన పడటంతో ఆయన అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. చికిత్స నిమిత్తం ఆయన్ను తిరుపతికి తరలించినట్లు సమాచారం.