శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (07:26 IST)

తుగ్లక్ రెడ్డి విచిత్ర నిర్ణయాలతో ప్రజలు పడరాని పాట్లు: వంగలపూడి అనిత

తుగ్లక్ రెడ్డి వింతపోకడలు, విచిత్రనిర్ణయాలతో ప్రజలు పలు రకాలుగా ఇబ్బందులపడుతున్నారని, తనబినామీల తాలూకా జేబులు నింపడంకోసం పేదవాడినోటి దగ్గరకూడు లాక్కోవడానికి కూడా ఆయన వెనుకాడటం లేదని టీడీపీమహిళానేత, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత  ఆక్షేపించారు.

ఆమె తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. నవంబర్ నాటికి రాష్ట్రంలో కోటి 52లక్షలవరకు రేషన్ కార్డులుంటే,  డిసెంబర్ వచ్చేనాటికి వాటిసంఖ్య కోటి 44లక్షల26వేలకు పడిపోయిందన్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలోనే 8లక్షల50వేలకు పైగా రేషన్ కార్డులను తొలగించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఆదాయం ఎలా సృష్టించాలో తెలియనినేపథ్యంలోనే, పేదలపై భారం మోపడానికి పాలకులు సిధ్దమయ్యారన్నారు.

కరోనా సమయంలో పనులు, తిండిలేక, డబ్బులు లేకప్రజలు అల్లాడుతున్న సమయంలో రేషన్ దుకాణాలద్వారా ప్రభుత్వం తమకు తోచినవాటిని  సరఫరా చేసిందన్నారు.  దుకాణాలవద్దకు వెళ్లినవారు, ఒక్కో సరుకు తీసుకోవడానికి ఒక్కో వేలిముద్ర వేయాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇది తుగ్లక్ చర్య కాక, మరేమవుతుందో  జగన్మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలని అనిత డిమాండ్ చేశారు.

ఒకసారి వేలిముద్ర వేస్తే, రేషన్ దారుడికి అవసరమైన అన్ని వస్తువులను ఒకేసారి ఇచ్చేయాలని, అందుకు విరుద్ధంగా బియ్యానికోసారి, పంచదారకోసారి వేలిముద్రలు వేయడమేంటన్నా రు. ప్రజలు తీసుకుంటారా...తీసుకోరా అన్న ఉద్దేశంతో, ప్రభుత్వం ఇలాచేయడమేంటన్నారు. పౌరసరఫరాలశాఖను ఆశాఖమంత్రి గుట్కా నమిలినట్లు నమిలేస్తున్నాడని అనిత ఆరోపించారు.

పేదల కడుపునింపే అన్నా క్యాంటీన్లను మూసేసిన ప్రభుత్వం, చివరకు రేషన్ కూడా సక్రమంగా పంపిణీ చేయలేకపోయిందన్నారు. రూ.10వేలజీతంతో బతికేవారు, నిత్యావసరాల ధరలపెరుగుదలతో నానా అవస్థలు పడుతున్నారన్నారు. వచ్చే పదివేలలో రూ.5వేలు సరుకులకే పోతే, సామాన్యుడు ఎలా బతుకుతాడో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

రూ.10వేల జీతముందని వారికి రేషన్ కార్డులు తీసేస్తే అంతకంటే దారుణం మరోటి ఉండదన్నారు. రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలనేదికూడా ప్రభుత్వానికి తెలియకపోతే ఎలాగని అనిత ప్రశ్నించారు. చేతగాని ప్రభుత్వం కాబట్టే నెలరోజుల్లోనే 9లక్షల రేషన్ కార్డులను తొలగించిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో వేలిముద్రలు పడనివారికి, స్థానిక వీఆర్వో వేలిముద్రగుర్తింపుతో సరుకులను అందచేయడం జరిగిందన్నారు.

ఈ ప్రభుత్వం వచ్చాక వీఆర్వోల గుర్తింపుని రద్దుచేసి, వాలంటీర్లకు ఆ అవకాశమిచ్చిందని, వారు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అనిత ఆరోపించారు. 2019 సెప్టెంబర్లో లక్షా 14వేల కార్డులకు చెందిన సరుకులను, వాలంటీర్లే తీసేసుకోవడం జరిగిందన్నారు. అక్టోబర్ లో 84వేలకు పైగా కార్డులసరుకులను కూడా అలానే తీసుకున్నారన్నారు. పైన రాజు ఎలాఉన్నాడో, కింద ఉన్న వాలంటీర్లుకూడా అలానే ఉన్నారన్నారు. 

ఫోర్ వీలర్, మాగాణి ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు తొలగిస్తున్నారన్నారు. ఆఖరికి  పేదలు తమఇంట్లోతినేదానికి కూడా లేకుండా చేస్తున్నా రని,  మంచినీరు తాగుదామంటే, అదికూడా కలుషితమై ప్రజలు వింతరోగాలబారిన పడే పరిస్థితులను ప్రభుత్వం కల్పించిందన్నారు . బాధ్యతలేని ముఖ్యమంత్రి, మంత్రుల పాలనలో, ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారన్నారు.

ఇసుకలేని కారణంగా 40లక్షలమంది ఉపాధికోల్పోయారని, వారికి కనీసం తినడానికి తిండికూడా లేకుండా పోయిందన్నారు. రేషన్ దుకాణాలద్వారా వచ్చినవాటిని తినిబతికే వీల్లేకుండా, కార్డులనుకూడా తొలగిస్తే వారిపరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పలేమన్నారు రేషన్ దుకాణాలకు మరోపేరు చౌకదుకాణాలని, అటువంటి వాటిలో కందిపప్పు రూ.62కు అమ్మితే, ప్రజలు ఎలా కొనగలరో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

రేషన్ సరుకులపై ఉన్న సబ్సిడీని కేవలం 20శాతానికే ప్రభుత్వం పరిమితం చేసిందన్నారు. ధనవంతుడు సొమ్ముని పేదలకు పంచారని గతంలో చదువుకున్నామని, కానీ జగన్ ప్రభుత్వం పేదలసొమ్ముని పెద్దలకు పంచిపెడుతోందని అనిత ఎద్దేవాచేశారు. జగన్ తనబినామీలను, తనవాళ్లను బాగుచేయడానికే చూస్తున్నాడని, రేషన్ సరుకులు పంచెనెపంతో ప్రజలసొమ్ము రూ700కోట్లను భారతి పాలిమర్స్ కు కట్టబెట్టారని అనిత మండిపడ్డారు.

ప్రజలసొమ్ము కాజేసినా ఇప్పటికీ రేషన్ పంపిణీకి అవసరమైన సంచులను పంపిణీ చేయలేకపోయార న్నారు. ప్రజలకు రేషన్ సరుకులు అందని నేపథ్యంలో, పౌరసరఫరాల శాఖామంత్రి బూతులతో కాలయాపన చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరుగుతుంటే, ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తుంటే టీడీపీ చూస్తూ ఊరుకోదని అనిత తేల్చిచెప్పారు.