1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (17:31 IST)

రోజాకు అసమ్మతి సెగ.. వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పవా?

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజాకు కష్టాలు తప్పేలా లేవు. నగరి వైసీపీలో రోజాకు ఇంటిపోరు గట్టిగానే వుందని సమాచారం. చిత్తూరు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. స్థానికంగా సొంతపార్టీలో అసమ్మతి సెగలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు విపక్ష టీడీపీపై పోరాడుతూనే.. ఇంకోవైపు స్వపక్షంలోనే విపక్షంగా మారిన వారిపైనా రోజా ఫైట్‌ చేయక తప్పడం లేదు. 
 
పంచాయతీ, పరిషత్ ఎన్నికల వేళ కూడా ఇదే తంతు. మున్సిపల్‌ ఎన్నికల వేళ కేజే కుమార్‌ వర్గంతో రోజాకు తలపోట్లు తప్పలేదు. నామినేటెడ్‌ పదవుల పందేరంలోనూ అదే రగడ. చివరకు నగరిలో రోజా వర్సెస్‌ లోకల్‌ వైసీపీ లీడర్ల మధ్య గొడవలు డైలీ సీరియల్‌ మాదిరి చర్చకు దారితీస్తున్నాయి.
 
ఇంటి పోరు నుంచి బయటపడేందుకు సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు ఎమ్మెల్యే రోజా తన బాధలు చెప్పుకున్నా ఫలితం దక్కలేదనే చర్చ సాగుతోంది. 
 
అంతేగాకుండా ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం కొత్తప్లాన్‌ అమలు చేస్తోంది. ఇన్నాళ్లూ స్థానిక వైసీపీ నేతలు వైరిపక్షంగా మారి రోజాపై ఎవరికి వారు పోరాటం చేసేవారు. ఆ వ్యతిరేకవర్గమంతా ఇప్పుడు ఒక్కటైంది. నగరిలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని.. ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా ఏం ప్లాన్ చేయాలనే అంశం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 
 
రోజా వ్యతిరేకవర్గమంతా ఇదే ఐక్యతతో సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లితే పరిస్థితి ఏంటన్న చర్చ నగరి వైసీపీలో మొదలైందట. ఎక్కడా లేని విధంగా నగరి వైసీపీలో ఈస్థాయిలో వ్యతిరేక ఎందుకొచ్చిందో పార్టీ పెద్దలు గుర్తించాలని.. లేకపోతే పార్టీకి గుడ్‌బై చెబుతామని అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారట. మరి ఈ అసమ్మతి సెగ నుంచి రోజా ఎలా బయటపడుతుందో వేచి చూడాలి.