బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 11 మార్చి 2020 (15:30 IST)

కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?

కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. రాకపోకలపై, ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇటు ప్రజలు కూడా ప్రయాణాలు చేయాలంటే భయపడుతున్నారు. అనేక ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. విమానాలు, రైళ్లు, బస్సుల లాంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించుకునేందుకు జంకుతున్నారు.

 
ఈ నేపథ్యంలో జనాల ఆందోళనలకు, ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిచేసింది బీబీసీ. బస్సులు, రైళ్లు, విమానాలు, ఓడల్లో ప్రయాణం ఎంతవరకూ సురక్షితం అన్నది విశ్లేషించే ప్రయత్నం చేసింది.

 
రైళ్లు, బస్సులు
కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందన్నదానిపై పూర్తి స్పష్టత లేదు. సాధారణంగా ఈ తరహా వైరస్‌లు రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర ద్వారా ఇంకొకరికి వ్యాపిస్తాయి. లేకపోతే, ఆ తుంపర ఉన్న ఉపరితలాలను తాకి, తిరిగి వాటితో కళ్లు, నోరు, ముక్కును తాకినప్పుడు శరీరంలోకి చేరతాయి.

 
ఫ్లూ లాగా కరోనావైరస్ గాలిలో ఎక్కువగా ఉండదని భావిస్తున్నారు. అంటే, రోగికి దగ్గరగా ఉంటేనే ఇంకో వ్యక్తికి అది సోకుతుంది. రోగికి రెండు మీటర్ల దూర పరిధిలో 15 నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఉంటే కరోనావైరస్ సోకవచ్చని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ సూచిస్తోంది. కాబట్టి బస్సుల్లో, రైళ్లలో వైరస్ ముప్పు అవి ఎంత రద్దీగా ఉన్నాయన్న విషయంపై ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు మెట్రో రైళ్లలో, సిటీ బస్సుల్లో జనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిలో ప్రయాణానికి, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధం ఉందని గతంలో ఓ అధ్యయనం సూచించింది. లండన్ అండర్‌గ్రౌండ్ (మెట్రో)లోను తరచూ ఉపయోగించేవారు ఫ్లూ లాంటి సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని బ్రిటన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్‌కు చెందిన డాక్టర్ లారా గోస్క్ చెప్పారు.

 
‘‘నేరుగా ప్రయాణానికి ఒకే రైలు ఉపయోగించేవారి కన్నా, రైళ్లు మారాల్సి వచ్చినవారికి ఫ్లూ ముప్పు ఎక్కువ ఉన్నట్లు మా పరిశోధనలో తేలింది’’ అని ఆమె అన్నారు. ఖాళీ రైళ్లు, బస్సుల్లో ముప్పు వేరేలా ఉంటుంది. వాటిలోకి గాలి ఎంతా బాగా వస్తుంది, ప్రయాణంలో ఎంత సమయం గడుపుతున్నాం అనే విషయాలపై అది ఆధారపడి ఉంటుంది.

 
పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమైన అంశం.
కరోనావైరస్ బారినపడే అవకాశాలున్న వ్యక్తులకు దగ్గరగా వెళ్లే అవకాశాలను ఎంత తగ్గించుకుంటే, అంత మంచిదని డాక్టర్ గోస్క్ అన్నారు. ‘‘రద్దీ ఉండే సమయాల్లో ప్రయాణం చేయకుండా ఉంటే మేలు. ఎక్కువ రైళ్లు, బస్సులు మారాల్సి రాకుండా... నేరుగా ఒకే దానిలో వెళ్లడం మంచిది’’ అని ఆమె సూచించారు.

 
విమానాలు
విమానంలో గాలి అందులోనే ఉండిపోతుంది కాబట్టి, విమాన ప్రయాణంలో అనారోగ్యం బారినపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చాలా మంది నమ్ముతుంటారు. కానీ, నిజానికి మన కార్యాలయాల్లో (రైళ్లు, బస్సుల్లో)ని గాలి కంటే విమానంలో ఉండే గాలి నాణ్యతే మెరుగ్గా ఉంటుంది. విమానంలో రద్దీ ఉన్నా, ఎప్పటికప్పుడు గాలి వేగంగా మారుతూ ఉంటుంది.

 
ఒక భవనంలో ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ ఉంటే అందులో గాలి 10-12 నిమిషాల్లో పూర్తిగా మారిపోతుందని, అదే విమానంలోనైతే 2-3 నిమిషాల్లోనే పూర్తిగా మారుతుందని పరడ్యూ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వింగ్యాన్ చెన్ చెప్పారు. విమానాల్లో హై ఎఫీషియన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్ (హెపా) ఉంటుంది. ప్రయాణికులు పీల్చే గాలిని ఇది శుభ్రం చేస్తూ ఉంటుంది. వైరస్‌లు సహా అతి చిన్న పార్టికల్స్‌ను పట్టేసే సామర్థ్యం హెపాకు ఉంది. సాధారణ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థలకు ఇది సాధ్యం కాదు.

 
హెపా బయటి నుంచి తాజా గాలిని తీసుకుని, క్యాబిన్‌లో ఉండే గాలిలో కలుపుతుంది. అంటే క్యాబిన్‌లో ఎప్పుడూ సగం తాజా గాలి ఉంటుంది. చాలావరకూ సాధారణ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థలు విద్యుత్‌ను ఆదా చేసేందుకు ఉన్న గాలినే తిరిగి సరఫరా చేస్తుంటాయి.
ఇన్ఫెక్షన్ ఉన్నవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపరను పీల్చినా... ఆ తుంపర ఉన్న ఉపరితలాలను తాకి, తిరిగి వాటితో కళ్లు, నోరు, ముక్కును తాకినా వైరస్ సోకే ముప్పు ఉంటుంది.

 
2018లో అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీకి చెందిన వికీ హెర్ట్జ్‌బెర్గ్ పది విమానాల్లోని ఉపరితలాలపై నుంచి శాంపిల్స్ సేకరించి ఓ అధ్యయనం నిర్వహించారు. సాధారణ భవనాలు, మిగతా రవాణా వ్యవస్థల్లో ఉండే పరిస్థితులే విమానాల్లోనూ కనిపించాయని ఆమె అన్నారు.

 
ఇన్ఫెక్షన్ సోకినవారి పక్క, ముందు, వెనుక సీట్ల తర్వాత విమానంలో అధిక ముప్పు ఉండేది తొలి రెండు వరుసల సీట్ల వారికి అని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) మార్గదర్శకాల్లో పేర్కొంది. విమాన ప్రయాణంతో ఉన్న ప్రధాన ఆందోళనకర అంశం ఏంటంటే, అది ఇన్ఫెక్షన్ ఉన్న వారిని ఒక దేశం నుంచి మరో దేశానికి మోసుకుపోగలదు.

 
నౌకలు
ఫిబ్రవరిలో డైమండ్ ప్రిన్సెస్ అనే నౌకలోని ప్రయాణికులు జపాన్‌లో చిక్కుకుపోయినప్పుడు నౌకల విషయం చర్చనీయమైంది. కాలిఫోర్నియా తీరంలో గ్రాండ్ ప్రిన్సెస్ అనే నౌకను కూడా నిలిపివేశారు. అందులోని ప్రయాణికుల్లో కొందరికి కరోనావైరస్ పరీక్షలు చేశారు. విమానంతో పోలిస్తే నౌకల్లో ముప్పు కొంచెం ఎక్కువ. చాలా మంది చాలా సమయం పాటు ఈ నౌకల్లో కలిసి ఉంటారు.

 
‘‘నౌకల్లో ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థలు బయటి గాలిని లోపలి గాలితో కలుపుతుంటాయి. కానీ, వాటితో ఓ ఇబ్బంది ఉంది. 5000 నానో మీటర్ల కన్నా చిన్నగా ఉండే పార్టికల్స్‌ను అవి వడపోయలేవు’’ అని ప్రొఫెసర్ చెన్ చెప్పారు.

 
2003లో సార్స్ వ్యాపించినప్పుడు దాని పార్టికల్స్ 120 నానో మీటర్ల వ్యాసంతో ఉన్నాయి. అంటే, నౌకల్లో అవి వ్యాపించగలిగేవి. ఉన్న గాలినే తిరిగి సరఫరా చేయకుండా, బయటి గాలిని నౌకల్లోని వ్యవస్థలు తీసుకుంటే ముప్పు ఉండదని ప్రొఫెసర్ చెన్ అంటున్నారు.