శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (14:09 IST)

ఈఎంఐంలపై మారటోరియం కావాలా? అయితే ఇలా చేయాలి...

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో అన్ని సేవలు బంద్ అయ్యాయి. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. అదే సమయంలో లాక్ డౌన్ క్రైసిస్ కారణంగా మూడు నెలల పాటు ఈఎంఐలపై మారటోయం విధించాలన్న డిమాండ్లు పుట్టుకొచ్చాయి. దీంతో భారత రిజర్వు బ్యాంకు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, మూడు నెలల మారటోరియంను అమలు చేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ సూచనల మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ఆ సదుపాయం కల్పిస్తూ ప్రకటనలు చేశాయి. ఈ విషయంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ముందుకొచ్చాయి. ఈఎంఐలపై మారటోరియం అవసరం లేని వినియోగదారులు తమను సంప్రదించాల్సిన అవసరం లేదంటూ తమ ఖాతాదారులకు హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్ర బ్యాంకులు తెలిపాయి. 
 
అలాగే, మారటోరియం కోరుకునే వినియోగదారుల కోసం ఓ ఈ-మెయిల్ ఐడీని కోటక్ మహీంద్ర బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. అయితే, మారటోరియం కాలానికి వడ్డీని మాత్రం వసూలు చేస్తామని తెలిపింది. మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ కూడా ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేసింది. వేతనదారుల రుణాలపై 'ఆప్ట్-ఇన్' , వ్యాపారుల కోసం 'ఆప్ట్-ఔట్' ఆప్షన్స్‌ను తీసుకొచ్చింది. ఏది ఏమైనా మారటోరియం కావాలా వద్దా అన్నది ఖాతాదారులకే అన్ని బ్యాంకులు వదిలివేశాయని చెప్పొచ్చు.