శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మార్చి 2020 (15:24 IST)

ఆంధ్రాలో ఆంక్షలు .. 11 గంటలకు తర్వాత ఎవ్వరూ బయటకురావొద్దు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తోంది. అలాగే, ఇతర రాష్ట్రాలకు రాష్ట్రానికి వచ్చే వారిని సరిహద్దుల్లోనే నిలిపివేసింది. ఒక వేళ రాష్ట్రంలోకి రావాలనుకుంటే 14 రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉంటామని హామి ఇస్తేనే అనుమతించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అదేసమయంలో నిత్యావసర విషయంలో కూడా ఏపీ సర్కారు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. 
 
ఇదే అంశంపై ఏపీ మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ, వ్యాపారులందరూ ధరల పట్టికను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పట్టికలో ఉన్నదాని కంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యావసరాల కొరత రాకుండా చూస్తున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే కొనుగోళ్లకు అవకాశమన్నారు. 11 దాటితే ప్రజలు బయటకు రావద్దని సూచించారు. 
 
చిన్న దుకాణాలు కూడా ధరల పట్టికను ఏర్పాటు చేయాలని మంత్రి కన్నబాబు చెప్పారు. నిత్యావసరాల కొరత రాకుండా ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకోవాలని సీఎం జగన్ చెప్పారని తెలిపారు. రైతు బజార్ల మాదిరిగానే నిత్యావసరాల ధరలు పట్టికలో చూపాలని చెప్పారు.
 
అలాగే, మరోమంత్రి కె. కన్నబాబు మాట్లాడుతూ, కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వ్యవసాయ కూలీల రాకపోకలను నిరాకరించవద్దని సీఎం ఆదేశించారని తెలిపారు. వ్యవసాయ, అనుబంధ యూనిట్లకు అనుమతి ఉన్నట్టు వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోకుండా గిట్టుబాటు ధరలు అందించేలా చర్యలు ఉంటాయని అన్నారు. 
 
రాష్ట్రంలో మొబైల్ మార్కెట్లు పెంచాలని సీఎం స్పష్టం చేశారని, నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, రాష్ట్రంలో చేపలు, రొయ్యలు లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయని, ఎంపెడాతో కలిసి రొయ్యల కొనుగోలుకు నిర్ణయించిన ధరకు కొనాలని స్పష్టం చేశారు.​