శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మార్చి 2020 (11:31 IST)

'కరోనా క్రైసిస్ చారిటీ'కి హీరో వరుణ్ - నిర్మాత దిల్ రాజుల విరాళం

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ కారణంగా దేశంలో అన్ని భాషల షూటింగ్‌లు బంద్ అయ్యాయి. దీంతో అనేక మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు తెలుగు చిత్రపరిశ్రమ స్పందించింది. మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో "కరోనా క్రైసిస్ చారిటీ (సిసిసి) మనకోసం" అనే సంస్థను స్థాపించారు. దీనిద్వారా పేద కళాకారులకు సాయం చేయనున్నారు. 
 
ఈ సీసీసీకి అనేక సినీ హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు, నటీనటులు తమవంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే. అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జులను తలా కోటి రూపాయల చొప్పున ప్రకటించగా, దివంగత డి.రామానాయుడు కుమారులైన నిర్మాత డి.సురేష్ బాబు, హీరో వెంకటేష్ కుటుంబం రూ.కోటి విరాళం ప్రకటించింది. అలాగే, ఇతర హీరోలు కూడా తమవంతు సాయం చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, తాజాగా మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కూడా తనవంతగా 20 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించారు. సంక్షోభం స‌మ‌యంలో నా వంతు సాయం చేస్తున్నాను. దయచేసి మీరు కూడా చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి మీ వంతు కృషి చేయండి అని వ‌రుణ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. 
 
అలాగే, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఆర్థిక సాయం ప్రకటించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సంస్థ నిర్వాహ‌కులు దిల్ రాజు, శిరీష్ రూ.10 ల‌క్ష‌ల విరాళాలు ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ.20 ల‌క్ష‌ల విరాళాన్ని అందించిన విష‌యం తెలిసిందే.