చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవిని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు కోరారు. దీనికి కారణం లేకపోలేదు. ఆర్జీవీ తెరకెక్కించిన తొలి చిత్రం శివ. అక్కినేని నాగార్జున - అమల హీరోహీరోయిన్లు. 36 యేళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించింది. ఇపుడు మళ్లీ రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి చిరంజీవి విషెస్ చెపుతూ ఓ వీడియోను షేర్ చేశారు.
దీనిపై రాంగోపాల్ వర్మ స్పందించారు. 'థాంక్స్ చిరంజీవి గారు. అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా. విశాల హృదయంతో మా టీమ్ని విష్ చేసింనందుకు మరోసారి కృతజ్ఞతలు' అని ట్వీట్ చేశారు.
అయితే, చిరంజీవికి వర్మ సారీ చెప్పడానికి కారణమేంటన్నది చెప్పకపోవడంతో నెట్టింట చర్చ మొదలైంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఆగిపోయిన ప్రాజెక్టును అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. చిరంజీవి హీరోగా ఆర్జీవీ 'వినాలని ఉంది' అనే సినిమా తెరకెక్కించాలనుకున్న సంగతి తెలిసిందే.
కాగా, శివ చిత్రం రీ రిలీజ్పై చిరంజీవి స్పందిస్తూ, 'శివ' చూసి నేను ఆశ్చర్యపోయా. అది సినిమా కాదు ఓ విప్లవం. తెలుగు సినిమాకి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఆ మూవీలో హీరో సైకిల్ చైన్ లాగే సీన్ ఎప్పటికీ మరిచిపోలేనిది. నాగార్జున యాక్టింగ్ ఫెంటాస్టిక్. అమల, రఘువరన్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండటం మంచి ప్రయత్నం.
ఈ సినిమా విషయంలో రామ్గోపాల్ వర్మ విజన్ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. కెమెరా యాంగిల్స్, లైట్స్ అండ్ సౌండ్స్ వావ్ అనిపించాయి. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని అప్పుడే నాకు అనిపించింది. హ్యాట్సాఫ్ టూ రామ్గోపాల్ వర్మ. చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని చిరంజీవి పేర్కొన్నారు.