1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (10:39 IST)

అమెరికాలో ఒక్క రోజే 1736మంది మృతి... వూహాన్‌లో లాక్ డౌన్ ఎత్తివేత

కరోనా వైరస్ వల్ల అమెరికాలో మంగళవారం ఒక్క రోజే అత్యధికంగా 1736 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 12,722కు చేరుకున్నది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇచ్చిన డేటా ప్రకారం ఈ విషయం వెల్లడైంది. అమెరికాలో ఇప్పటి వరకు 3,98000 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 
 
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 14 లక్షలు దాటాయి. దేశంలో మరణాల సంఖ్య అత్యధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తాజా మీడియా సమావేశంలో వెల్లడించారు. కేవలం న్యూయార్క్‌లోనే మంగళవారం 731 మంది మరణించారు. మరోవైపు చైనాలోని వుహాన్ నగరంలో దాదాపు 11 వారాల క్రితం విధించిన లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు.
 
ఇదిలా ఉంటే.. కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన వుహాన్‌లో పరిస్థితులు కుదుట పడ్డాయి. కరోనా పాజిటివ్‌ కేసులు పూర్తిగా నియంత్రణలోకి రావడంతో అక్కడ లాక్‌డౌన్‌ ఎత్తివేసినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ మొదట వ్యాపించింది.. కోటి 60 లక్షల జనాభా ఉండే వుహాన్ నగరంలోనే. జనవరి 23న చైనా ప్రభుత్వం అక్కడ లాక్‌డౌన్‌ విధించింది. 
 
ఆ తర్వాత హుబే ప్రావిన్స్ మొత్తాన్నీ నిర్బంధంలో ఉంచింది. ఎట్టకేలకు 76 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేశారు. ఇప్పుడు వుహాన్ ప్రజలు ఇక స్వేచ్ఛగా తిరిగేయొచ్చు. చైనాలో నిన్న కొత్తగా 62 కేసులు నమోదుకాగా, ఇద్దరు మృతి చెందినట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది.