1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (22:21 IST)

దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కరోనా సహాయ కార్యక్రమాలు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలకు సహకారం అందించడంతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు దేశ వ్యాప్తంగా బాధితులకు అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవహ శ్రీ కాచం రమేశ్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. 
 
దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా విపత్తు, ప్రమాదం సంభవించినప్పుడు బాధితులకు సహాయం అందించడానికి స్వయంసేవకులు సహజంగానే ముందుకు వస్తారని, స్వయంసేవకుల ఈ స్వచ్ఛంద సేవాభావం చూసి అనేకమంది ప్రముఖులు ఆర్ ఎస్ ఎస్ ను రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్ అని అంటూ ఉంటారని ఆయన గుర్తుచేశారు. 
 
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ మూలంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వారికి తగిన సహాయం అందించడానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్వయంసేవకులు పనిచేస్తున్నారని ఆయన తెలియజేశారు. దేశవ్యాప్తంగా 26వేల స్థలాలలో 2లక్షల మంది స్వయంసేవకులు 25లక్షల కుటుంబాలకు సహాయం అందజేశారని వివరించారు. 
 
అలాగే తెలంగాణ రాష్ట్రంలో 369 స్థలాల్లో జరుగుతున్న కార్యక్రమాల ద్వారా 2678 మంది స్వయసేవకులు 25వేల కుటుంబాలను ఆదుకున్నారని ఆయన తెలియజేశారు. ఆర్ ఎస్ ఎస్ సేవావిభాగమైన సేవాభారటితోపాటు అనేక ఇతర సంస్థలతో కూడా కలిసి స్వయంసేవకులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 
 
పేదలకు భోజన సదుపాయం కల్పించడం, ఉప్పు, నూనె, పప్పు, మొదలైన నిత్యవసర వస్తువులతో కూడిన కిరాణా కిట్‌ను ఇంటింటికి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు స్వయంసేవకులు చేస్తున్నారు. అలాగే కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ప్రజలకు తెలియజెపుతున్నారు. రేషన్ షాప్‌లు మొదలైన రద్దీ ప్రదేశాల్లో సామాజిక దూరాన్ని పాటించేవిధంగా చూడటం, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు సహకరించడం వంటివి కూడా స్వయంసేవకులు చేస్తున్నారని శ్రీ రమేశ్ ఆ ప్రకటనలో వివరించారు.