శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 మే 2020 (09:55 IST)

భారత్‌లో కరోనా ఉగ్రరూపం - మరో 3561 కొత్త కేసులు

భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఫలితంగా గత 24 గంటల్లో మరో 3561 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52952కు చేరింది. 
 
అలాగే, గత 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. మొత్తం 89 మంది చనిపోగా, ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 1783కు చేరినట్టు కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఇకపోతే, గత 24 గంటల్లో దేశంలో 3,561 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం  52,952కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 15,266 మంది కోలుకోగా, ఒకరు విదేశాలకు వెళ్లిపోయారు. ఆసుపత్రుల్లో 35,902 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలావుండగా, బుధవారం తెలంగాణాలో కొత్తగా 11 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,107కు చేరుకుంది. 
 
వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 430. ఈరోజు 20 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 648కి పెరిగింది. ఈ వివరాలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.