1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జులై 2021 (10:14 IST)

మూడు నెలల తర్వాత 40 వేల దిగువకు పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గత మూడు నెలల తర్వాత ఈ కేసుల నమోదులో గణనీయంగా తగ్గుదల కనిపించింది. ఆదివారం 43,071 కేసులు నమోదవగా, సోమవారం వెల్లడించిన వివరాల మేరకు 40 వేలకు దిగువన రికార్డయ్యాయి. ఇది ఆదివారం నాటి కంటే 7.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి 19 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే మొదటిసారని పేర్కొన్నది.
 
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 39,796 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,85,229కి చేరింది. ఇందులో 2,97,00,430 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,02,728 మంది రోగులు మహమ్మారి వల్ల మరణించారు. 
 
మొత్తం కేసుల్లో 4,82,071 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 723 మంది కొత్తగా మృతిచెందారని, 42,352 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదేవిధంగా ఇప్పటివరకు 35,28,92,046 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని తెలిపింది.
 
దేశవ్యాప్తంగా జూలై 4 నాటికి మొత్తం 41,97,77,457 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 15,22,504 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.