గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 మార్చి 2021 (19:22 IST)

ఆంధ్రప్రదేశ్‌లో చాపకింద నీరులో కరోనా వైరస్ వ్యాప్తి

దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్‌లలో రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతోంది. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటు దక్షిణాదిలోనూ కేసుల తీవ్రత నానాటికీ పెరుగుతోంది.
 
ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 380 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,93,366కి చేరింది. 
 
కోవిడ్ కారణంగా శనివారం కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7,189కి చేరింది. 
 
గత 24 గంటల్లో రాష్ట్రంలో 204 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,84,094కి చేరింది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,083 మంది చికిత్స పొందుతున్నారు.
 
గడిచిన 24 గంటల్లో 30,978 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా... ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కోవిడ్ నిర్థారణా పరీక్షల సంఖ్య 1,47,05,188కి చేరుకుంది.
 
గడచిన 24 గంటలలో అనంతపురం 22, చిత్తూరు 60, తూర్పుగోదావరి 26, గుంటూరు 70, కడప 8, కృష్ణా 44, కర్నూలు 51, నెల్లూరు 21, ప్రకాశం 6, శ్రీకాకుళం 15, విశాఖపట్నం 43, విజయనగరం 9, పశ్చిమ గోదావరిలలో 5 కేసులు చొప్పున కేసులు నమోదయ్యాయి.