1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (16:45 IST)

నూజివీడులో 45 యేళ్ళు దాటిన వారికి కోవిడ్ టీకాలు

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో 45 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరికి కోవిడ్ వాక్సిన్ అందించాలని శాసనసభ్యలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక సమతానగర్లోని వార్డ్ సచివాలయంలో గురువారం కోవిడ్ వాక్సిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం 17, 18 వార్డుల ప్రజలకు అందిస్తున్న కోవిడ్ వాక్సిన్‌ను గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. 
 
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కరోనా సెకండ్ వేవ్ విజ్రంభిస్తున్న ప్రస్తుత  తరుణంలో కోవిడ్ నియంత్రణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. 45 సంవత్సరాల వయస్సు నిండిన ప్రజలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ కోవిడ్ వాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు ఆదేశాలు జారీచేసిందన్నారు. 
 
వాక్సిన్ నిమిత్తం ప్రజలు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ప్రాంతం వద్దకే అందిస్తున్నామన్నారు. ప్రతీ గ్రామ/వార్డ్   సచివాలయాలు పరిధిలో వాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా వార్డుల పరిధిలో అర్హులైన ప్రతీ ఒక్కరికి వాక్సిన్ అందిస్తున్నామన్నారు. వాక్సిన్ పట్ల ఎవరూ ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, వాక్సిన్ తీసుకుని కోవిడ్ నుంచి రక్షణ పొందాలన్నారు.   
 
ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డా.నరేంద్రకృష్ణ మాట్లాడుతూ నూజివీడు పట్టణ  పరిధిలో ఇంతవరకు 8 వేల మందికి వాక్సిన్ వేశామన్నారు.  నూజివీడు పట్టణ పరిధిలో  45 సంవత్సరాల వయస్సు దాటినవారు, దీర్గకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తమ ఆధార్ కార్డు తీసుకుని తమ వార్డ్ సచివాలయాలలో వాక్సిన్ నిమిత్తం నమోదు చేసుకోవాలన్నారు. 
 
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, డా.కేశవ నారాయణ, కౌన్సిలర్లు పగడాల సత్యనారాయణ, అశోక్, శీలం రాము, ప్రభృతులు పాల్గొన్నారు.