1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 మే 2021 (10:31 IST)

సెకండ్ వేవ్ అంతమైన 6 నుంచి 6 నెలల తర్వాత థర్డ్ వేవ్ విజృంభణ

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి సెకండ్ వేవ్.. వచ్చే జూలై నాటికి అంతమైపోవచ్చునని.. అయితే థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం వుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అది కూడా సెకండ్ వేవ్ అంతమైన 6 నుంచి 8 నెలల తర్వాత వ్యాపించే ముప్పు ఉందని చెప్తున్నారు. అయితే రెండో వేవ్ అంత ప్రభావం ఉండదంటున్నారు. ఒక్క రకంగా చెప్పాలంటే ఇది ఊరటనిచ్చే విషయమే.
 
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిధిలోని సైన్స్‌, టెక్నాలజీ విభాగం సైంటిస్టుల బృందాన్ని ఏర్పాటు చేసింది. 'సూత్ర' (ససెప్టబుల్‌, అన్‌డిటెక్టెడ్‌, టెస్టెడ్‌ (పాజిటివ్‌) అండ్‌ రిమూవ్డ్‌ అప్రోచ్‌) అనే మోడల్‌ ద్వారా అంచనా వేసింది. దేశంలో మే నెలాఖరుకల్లా రోజువారీ కేసుల సంఖ్య 1.5 లక్షలకు చేరుతుందన్నారు. జూన్‌ ఆఖరు నాటికి 20వేలకు తగ్గుతుందని తెలిపారు. 
 
ఇప్పటికే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కరోనా పీక్‌ దశకు చేరినట్లు తెలిపారు. తమిళనాడు, పంజాబ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా మే 19 నుంచి 31 మధ్య కరోనా కేసుల తీవ్రత పీక్ దశకు చేరుతాయని అంచనా.
 
'సూత్ర' మోడల్ ప్రకారం.. దేశంలో అక్టోబరు వరకు కరోనా మూడో ఉద్ధృతి ఉండకపోవచ్చని అంటున్నారు. వ్యాక్సినేషన్‌ పెంచడం ద్వారా వైరస్ ప్రభావితం తక్కువగా ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. 
 
కరోనా మహమ్మారుల తీవ్రత, ప్రభావం వంటి అంచనా వేసేందుకు గణితశాస్త్ర విధానాల్లో ఒకటి సూత్ర. కొవిడ్‌పై అధ్యయనం చేసేందుకు గతేడాదిలోనే ఈ మోడల్‌ను అనుసరిస్తున్నారు. ఈ 'జాతీయ కొవిడ్‌-19 సూపర్‌మోడల్‌ కమిటీ' దీని ఆధారంగానే భారత్‌లో కొవిడ్‌ వ్యాప్తిపై అంచనాలను రూపొందించింది.