మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (08:50 IST)

తెలంగాణాలో ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా.. మొత్తం కేసులు 27

తెలంగాణా రాష్ట్రంలో ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. వీరిలో ఇంటి యజమానితో పాటు.. అతని భార్య, కుమారుడు ఉన్నాడు. దీంతో తెలంగాణా రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27కు చేరింది. నాలుగు రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యాపారి వైరస్ బారిన పడగా, ఆతన కుమారుడికి, భార్యకు కూడా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
 
వీరితో పాటు గుంటూరుకు చెందిన యువకుడు లండన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ రాగా, అతనికి పాజిటివ్ వచ్చింది. లండన్ నుంచే దోహా మీదుగా వచ్చిన కూకట్‌పల్లి ప్రాంత యువకుడికి కూడా వైరస్ సోకింది.
 
ఇక హైదరాబాద్ లోని గాంధీ, చెస్ట్ హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక వార్డులన్నీ నిండిపోవడంతో, కింగ్ కోటి ఆసుపత్రికి రోగులను తరలిస్తున్నారు. సమీప భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశం ఉన్నందున గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్‌ని ఇప్పటికే ఐసోలేషన్ కోసం సిద్ధం చేసిన అధికారులు, అవసరాన్ని బట్టి, దాన్ని పూర్తి స్థాయి ఆసుపత్రిగా మార్చాలని భావిస్తున్నారు.
 
మరోవైపు, మహబూబాబాద్ జిల్లాలో హోం క్వారంటైన్ పాటించని నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల ఇద్దరు దంపతులు ఖతార్ నుంచి జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఉన్న అత్తగారింటికి వచ్చారు. 
 
విషయం తెలిసిన వైద్యాధికారులు దంపతులతోపాటు వారి అత్తమామలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించి ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని, స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు. 
 
అయితే, అధికారులను సూచనలను బేఖాతరు చేస్తూ వారు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. విషయం తెలిసిన తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో దంపతులతోపాటు అత్తమామలపై కేసు నమోదు చేశారు.