శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (17:31 IST)

దేశంలో నాలుగో కరోనా మృతి.. తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న కేసులు

దేశంలో నాలుగో కరోనా సోకిన వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా గురువారం పంజాబ్‌లో మరో వ్యక్తి మరణించారు. దీంతో కరోనా ప్రభావంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. దేశంలో ఇప్పటికే 184 మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఒంగోలు రిమ్స్ ఐసోలేషన్ వార్డులో కరోనా సోకిన 23ఏళ్ల యువకుడికి చికిత్స అందించారు. కానీ ఆ వ్యక్తి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది అలర్టయి వెంటనే..నాలుగో ప్లోర్‌లో అతడ్ని పట్టుకున్నారు. యువకుడు కొద్దిరోజుల క్రితమే లండన్ నుంచి ఒంగోలు వచ్చాడు. వస్తూ వస్తూ కరోనాను తెచ్చాడు.
 
కరోనా సోకిందన్న మానసిక బాధతోనే అతడు పారిపోయేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.రిపోర్టులో అతడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఒంగోలు రిమ్స్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు.
 
అలాగే తెలంగాణ ప్రజలను కోవిడ్‌ వైరస్‌ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి ఒకేసారి ఏడు కరోనా కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. కొత్తగా కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితులెవరూ తెలంగాణ వారు కాదు. వారంతా ఇండోనేషియాకు చెందినవారేనని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది.