1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (12:38 IST)

హైదరాబాదులో కరోనాతో డాక్టర్ మృతి... అలెర్టయిన గ్రామాలు

తెలంగాణలో వైరస్‌ విజృంభణ రోజురోజుకూ పెరిగిపోతోంది. హైదరాబాద్‌‍లో కోవిడ్ కారణంగా డాక్టర్‌ మృతిచెందారు. ఈనెల 16న కిమ్స్‌ ఆస్పత్రిలో ఖైరతాబాద్‌కు చెందిన డాక్టర్‌ చేరారు. ఈ నెల 18న డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
అయితే ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ డాక్టర్‌ ప్రాణాలు విడిచారు. నాలుగు దశాబ్ధాలుగా ఖైరతాబాద్‌లో డాక్టర్ క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. కాగా, వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా..సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో తొలుత లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. 
 
మరోసారి లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరిగినా.. అది సాధ్యం కాదని తేలిపోయింది. ఈ తరుణంలో.. స్వీయ నియంత్రణే శరణ్యమని కొంతమంది ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాలు తమంతట తమే లాక్ డౌన్ విధించుకుంటున్నారు. మొన్న భిక్కనూరు, నిన్న గంభీరావు పేట, నేడు ఇబ్రహీంపట్నం. ఇలా లాక్ డౌన్ ప్రకటించుకుంటున్నారు. 
 
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలకు అనుమతినిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేయడంతో తెలంగాణలో కేసులు పెరిగిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఇతర గ్రామాలు అలర్ట్ అయ్యాయి. 
 
వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే స్వీయ కట్టడి మేలని గ్రామ పంచాయతీలు భావించాయి. అందులో భాగంగా తీర్మానాలు చేస్తూ..లాక్ డౌన్‌ను పకడ్బందిగా అమలు చేస్తున్నాయి.