శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (12:37 IST)

ఎంపీ కేశినేనికి కొవిడ్‌ పాజిటివ్‌ .. కుంభమేళాలో 30మంది సాధువులకు కరోనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నానికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
 
మరోవైపు, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న పవిత్ర కుంభమేళాపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటికే అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి. 
 
తాజాగా కుంభమేళాలో పాల్గొన్న 30 మంది నాగసాధువులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆల్‌ ఇండియా అఖాడా పరిషత్‌ నాయకుడు మహంత్‌ నరేంద్ర గిరి కూడా కరోనాతో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేరారు. 
 
‘‘ఇప్పటివరకు 30 మంది సాధువులకు కరోనా సోకింది. నిరంజిని, జునా సహా దాదాపు అన్ని అఖాడాలోని సాధువులు వైరస్‌బారిన పడ్డారు. మిగతావారికి కూడా పరీక్షలు చేస్తున్నాం’’ అని హరిద్వార్‌ చీఫ్‌ మెడికల్‌ అధికారి ఎస్‌కే ఝా తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో నిరంజిని అఖాడా సాధువుల బృందం కుంభమేళాను వీడేందుకు సిద్ధమైంది. 
 
‘‘కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మా కుంభమేళాను ముగిస్తున్నాం. మా ప్రధాన రాజస్నానం పూర్తయ్యింది. మా అఖాడాలో చాలా మందికి కొవిడ్‌ లక్షణాలు కన్పిస్తున్నాయి. అందుకే శనివారం మేమంతా హరిద్వార్‌ను వీడుతున్నాం’’ అని ఈ అఖాడా సెక్రటరీ రవీంద్ర పూరి మీడియాకు తెలిపారు. 
 
ప్రముఖ సాధువు కన్నుమూత
ఇదిలా ఉండగా.. మహా నిర్వాణి అఖాడా హెడ్‌, ప్రముఖ సాధువు స్వామి కపిల్‌ దేవ్‌ కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చికిత్స నిమిత్తం రిషికేష్‌లో చేరారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ గురువారం తుదిశ్వాస విడిచారు.