1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (20:24 IST)

తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా 1,920 కోవిడ్ కేసులు

తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా మరో 1,920 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,97,775కు చేరుకుంది. అలాగే, ఈ వైరస్ బారినపడినవారిలో 417 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,045గా వుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ రేటు 97.05 శాతంగా ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా 16,496 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఏపీలో 1,831 కరోనా పాటిటివ్ కేసులు 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా వంద శాతం కేసులు పెరిగాయి. తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం 1831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు కావడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. సోమవారం ఈ కేసుల సంఖ్య 984గా ఉన్న విషయం తెల్సిందే. ఇపుడు ఈ కేసులు ఒక్కసారిగా 1831కు చేరాయి. 
 
ఈ నెలాఖరు వరకు రాత్రిపూట కర్ఫ్యూ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వం అనేక కఠిన ఆంక్షలు విధిస్తుంది. ఇందులోభాగంగా, ఈ నెల 31వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. అలాగే, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అంటే ఒక సీటు విడిచి మరో సీటులో కూర్చొని సినిమా తిలకించేలా షరతులు విధించింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో పాటు.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ నెల 31వ తేదీ వరకు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. 
 
అయితే, రాత్రిపూట కర్ఫ్యూ నుంమచి ఆస్పత్రులు, ఫార్మసీ దుకాళాలు, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, వైద్య సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది.