1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (20:45 IST)

దుర్గగుడిలో కరోనా కలకలం.. అర్చకుడు శివ మృతి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా దుర్గగుడిలో కరోనా కలకలం రేపింది. శనివారం కరోనాతో ఆలయ అర్చకుడు రాచకొండ శివ మృతిచెందాడు. కాగా నిన్న కరోనాతో పరిచారకుడు నరేష్‌ మృతిచెందాడు. అలాగే ఈరోజు ఐదుగురు అర్చకులకు కరోనా పాసిటీవ్‌గా నిర్ధరణ అయింది. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆలయంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అర్చకులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
 
మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కొనుగోళ్లకు ఏపీ సర్కార్ కసరత్తులు మొదలు పెట్టింది. నిన్ననే సిరం కంపెనీ సిఇవో, భారత్ బయెటెక్ ఎండిలతో ఫోన్ లో మాట్లాడిన ఏపీ సీఎం వైఎస్ జగన్, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున వేరువేరుగా లేఖలు రాసింది. ఏపిలో 18 నుండి 45 వయస్సులోపు వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని సియం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
4.08 కోట్ల డోసులు కోవిషిల్డ్, 4.08 కోవాగ్జిన్ డోసులు సరఫరా చేయాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఆయా కంపెనీల ప్రతినిధులకు ఏపి కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర లేఖలు రాశారు. ఇక మరో పక్క ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మరో ఉన్నతాధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.