ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 6 జులై 2021 (11:58 IST)

ఆగ‌స్టులోనే థ‌ర్డ్ వేవ్? ఎస్‌బీఐ అంచ‌నా నివేదిక

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లంతా వ‌ణికిపోయారు. భార‌త్‌లో అయితే, రెండో ద‌శ‌లోనే మృతుల సంఖ్య ల‌క్ష‌లు దాటింది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి.
 
అయినప్పటికీ మూడో ముప్పు తప్పదని ఇప్పటికే ఆరోగ్యరంగ నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలోనే అంటే ఆగస్టులో థర్డ్‌ వేవ్‌ మొదలయ్యే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక హెచ్చరించింది. సెప్టెంబర్‌ నెలలో ఇది గరిష్ఠానికి చేరుకోవచ్చని అంచనా వేసింది.
 
అస‌లు క‌రోనా గురించి ఆరోగ్య శాఖ‌కు, ఆరోగ్య శాస్త్ర‌వేత్త‌ల‌కు సంబంధం కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఏం సంబంధం అనుకుంటున్నారు. క‌రోనా పుణ్య‌మా అని అన్ని రంగాల వారు ఈ కోవిడ్ సంక్షోభంలో ప‌డ్డారు. అందుకే, ఎవ‌రికి వారు ప్ర‌త్యేకంగా నిపుణుల స‌హ‌కారంతో క‌రోనా నివేదిక‌లు రూపొందిస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి ఎలా గ‌ట్టెక్కాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
 
దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి, బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం వంటి అంశాలపై భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ నిపుణుల బృందం ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా ‘కొవిడ్‌19: ది రేస్‌ టు ఫినిషింగ్‌ లైన్‌’ పేరుతో తాజాగా పరిశోధనాత్మక నివేదికను విడుదల చేసింది.

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగానే ఉందని అభిప్రాయపడిన నివేదిక, మే 7వ తేదీన గరిష్ఠానికి చేరుకున్నట్లు తెలిపింది. ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే, జులై రెండో వారానికి రోజువారీ కేసుల సంఖ్య 10వేలకు తగ్గుతుందని పేర్కొంది. అయినప్పటికీ ఆగస్టు రెండో వారం నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. 
 
థర్డ్ వేవ్‌లో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ గరిష్ఠ కేసులతో పోలిస్తే, థర్డ్‌వేవ్‌ గరిష్ఠ స్థాయి కేసులు 1.7రెట్లు ఎక్కువగా ఉండవచ్చ‌ని నిపుణులు తేల్చారు. ఇప్పటివరకు నమోదవుతున్న గణాంకాల ప్రకారం, ఆగస్టు రెండో వారం తర్వాత కేసుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అనంతరం నెల రోజుల వ్యవధిలోనే గరిష్ఠానికి చేరుకుంటుంద‌ని నివేద‌క పేర్కొంది.
 
భార‌త దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగానే కొనసాగుతోంది. నిత్యం సరాసరి 40లక్షల డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు దేశ జనాభాలో 4.6 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. మరో 20.8శాతం మంది కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అయితే, ఇది అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ దేశాలతో పోలిస్తే కాస్త తక్కువేనని ఎస్‌బీఐ నివేదిక అభిప్రాయపడింది.