1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (15:17 IST)

పెరుగుతున్న కరోనా కేసులు.. భారత్‌లో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడ?

దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు చాలా తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. కానీ, వెస్ట్ బంగాల్, కేరళ రాష్ట్రాల్లో మాత్రం ఈ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా, బెంగాల్ రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వం లాక్డౌన్‌ను విధించింది. 
 
మూడు రోజుల పాటు అన్నింటినీ బంద్ చేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. అత్యవసర సేవలు తప్ప అన్నింటిపైనా ఆంక్షలు విధించింది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే సోనార్‌పూర్ ఉండటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా సోనార్‌పూర్‌లో 19 కంటెయిన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.
 
మరోవైపు, దుర్గా పూజ పండుగల తర్వాత కరోనా కేసులు పెరగడంతో బెంగాల్ ప్రభుత్వానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) లేఖ రాసింది. దుర్గా పూజ పండుగ నుంచి ఇప్పటిదాకా కరోనా కేసులు 25 శాతం పెరిగాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం ఒక్కరోజే కోల్‌కతాలోనే 248 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయని గుర్తుచేసింది. 
 
అయితే, కొత్త కేసుల్లో వ్యాక్సిన్ వేసుకున్న వారే ఎక్కువగా ఉంటున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పడం ఆందోళన కలిగించే విషయం. కరోనా టీకాలు వేయించుకున్నప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఈ వైరస్ బారినపడరన్న గ్యారెంటీ లేదనే విషయం తేటతెల్లమవుతుంది.