మంగళవారం, 2 డిశెంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 డిశెంబరు 2025 (12:04 IST)

విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన విరాట్ కోహ్లీ

virat kohli
గత కొంతకాలంగా తనపైనా, తన ఫామ్‌పైనా వస్తున్న విమర్శలకు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఆదివారం రాంచీ వేదికగా సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 120 బంతుల్లో ఏడు సిక్స్‌లు, 11 ఫోర్ల సాయంతో 135 పరుగులు చేసి తానేంటో మరోమారు నిరూపించాడు. పైగా, ఫార్మెట్ ఏదైనా, తనకు వయసు పెరుగుతున్నా తన క్లాస్ ఆటతీరు మాత్రం శాశ్వతమని బ్యాట్‌తోనే బదులిచ్చాడు. ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను టెస్టు జట్టులోకి తిరిగి రావాలని బీసీసీఐ కోరుతున్నట్లు వార్తలు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న కోహ్లి తన భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టతనిచ్చాడు. 'నేను ఏ ఫార్మాట్ ఆడినా నా 120 శాతం ఇస్తాను. నా సన్నద్ధతపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రస్తుతానికి నా దృష్టి కేవలం వన్డే ఫార్మెట్‌పైనే ఉంది. టెస్టుల గురించి ఆలోచించడం లేదు' అని తేల్చి చెప్పాడు. దీంతో అతని టెస్టు పునరాగమనంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.
 
ఈ మ్యాచ్‌లో తొలతు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ 135, కేఎల్ రాహుల్ 60, రోహిత్ శర్మ 57, రవీంద్ర జడేజా 32 చొప్పున పరుగులు చేశారు. ఆ తర్వాత సౌతాఫ్రికా జట్టు 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో మ్యాథ్యూ బ్రీట్జ్కే 72, మార్కో జెన్సన్ 70, బోష్ 67, జోర్జి 39, బ్రెవిస్ 37 చొప్పున పరుగులు చేశారు. అయితే భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో విజయానికి 18 పరుగుల దూరంలో సఫారీలో పోరాటం ఆగిపోయింది.