1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (10:16 IST)

చికిత్స కోసం ఆస్పత్రికెళ్లిన నెల్లూరు టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

హైదరాబాద్ నగరంలో మరో విషాదకర ఘటన జరిగింది. టెక్కీ ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం ఆస్పత్రికెళ్లిన ఆమె.. అక్కడ ప్రాణాలు తీసుకోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది.
 
రాజేంద్రనగర్‌ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కేంద్రానికి చెందిన సుదీప్తి (27) హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తుంది. ఆమె బండ్లగూడజాగీర్‌లోని అపార్ట్‌మెంట్లో ఉంటూ విధులకు హాజరవుతోంది. 
 
ఈ క్రమంలో ఈ నెల 6న అనారోగ్యంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. మూడు రోజులుగా ఆమె చికిత్స తీసుకుంటూ పూర్తిగా కోలుకుంది. మంగళవారం మధ్యాహ్నం డిశ్ఛార్జ్‌ చేస్తామని వైద్యులు తెలిపారు. 
 
ఈ క్రమంలో ఉదయం 9 గంటల సమయంలో ఆమెను పరిశీలించేందుకు నర్సు ఆమె గది దగ్గరకు వెళ్లింది. ఈ సమయంలో లోపలి తలుపు గడి పెట్టుకొని ఉండటంతో ఆమె ఆసుపత్రి సిబ్బందికి సమాచారమిచ్చింది. 
 
అనంతరం సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికెళ్లి చూడగా.. సుదీప్తి ఫ్యానుకు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆసుపత్రి నిర్వాహకులు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువతి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడిందో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.