1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Man Brutally Murdered in Kurnool District

మద్యంలోకి స్నాక్స్ తెచ్చుకునేందుకు బైక్ ఇవ్వలేదని బండరాయితో మోది చంపేశారు...

murder
మద్యంలోకి స్నాక్స్‌ తెచ్చుకోడానికి బైక్‌ ఇవ్వనందుకు ఒకరిని పాశవికంగా హతమార్చారు. మృతుడికి.. నిందితులకు ఎలాంటి పరిచయం లేకపోయినా మత్తులో బండరాయితో మోది నీ ముఖం ఎలా ఉందో చూసుకుంటావా అంటూ హింసించి హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులతోపాటు ఆధారాలు నాశనం చేసేందుకు సహకరించిన మరో యువకుడిని అరెస్టు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు (36) ఏడేళ్లుగా తిరుపతిలో ఉంటూ మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నెల 9న రాత్రి ఇంటి నుంచి బైక్‌పై బయటకు వెళ్లిన అతను జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలంలో కూర్చొని మద్యం తాగుతున్నారు.
 
అదేసమయంలో ఓటేరుకు చెందిన ఉప్పుసెట్టి ఆకాష్‌ (24), శ్రీనివాసపురానికి చెందిన రాఘవేంద్ర (20) మద్యంతో అక్కడికి వచ్చారు. అవసరమైన తినుబండారాలు తెచ్చుకునేందుకు.. అక్కడే మద్యం తాగుతున్న శ్రీనివాసులును బైక్‌ ఇమ్మని అడిగారు. అతను నిరాకరించడంతో మత్తులో ఉన్న ఆ ఇద్దరూ బీరు సీసాలతో తలపై కొట్టారు. 
 
తర్వాత బండరాయితో ముఖంపై మోదుతూ వీడియో తీసుకున్నారు. అనంతరం వీడియోను రక్తగాయాలతో మూలుగుతున్న అతనికి చూపించే ప్రయత్నం చేశారు. జరిగిన ఘటనను యోగిమల్లవరం గ్రామానికి చెందిన జయవేలు రాజ (20)కు చెప్పడంతో అతను ఆధారాలు నాశనం చేసేందుకు యత్నించాడు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి సోమవారం రాత్రి ఆర్సీపురం కూడలిలో అరెస్టు చేశారు. వారి నుంచి ద్విచక్ర వాహనం, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు. 
About Writer
ఠాగూర్