1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. technology misuse tuition teacher arrested for harassing student with ai

ఏఐ సాంకేతికతతో విద్యార్థిని ఫోటోలను మార్ఫింగ్ చేసిన ట్యూషన్ టీచర్.. సంకెళ్లు వేసిన ఖాకీలు

crime
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఓ మైనర్ బాలికను బ్లాక్ మెయిల్‌‍కు గురిచేసిన ట్యూషన్ టీచర్‌ను విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థినికి సంబంధించిన సాధారణ చిత్రాలను ఏఐ టూల్స్ సహాయంతో అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేసి, వాటితో బెదిరింపులకు పాల్పడిన షణ్ముఖ్ హితేష్ అనే నిందితుడుని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
పోలీసుల కథనం మేరకు.. నిందితుడు షణ్ముఖ్ హితేష్ తన వద్ద ట్యూషన్ తీసుకుంటున్న బాలిక ఛాయాచిత్రాలను సేకరించారు. అనంతరం ఏఐ సాంకేతికతతో ఆ చిత్రాలను అశ్లీల మార్ఫింగ్ ఫోటోలను మార్చాడు. తాను చెప్పినట్టుగా వినకపోతే ఆ ఫోటోలను ఇతరులకు పంపిస్తానని సదరు బాలికను తీవ్రంగా బెదిరించడం మొదలుపెట్టాడు. 
 
నిందితుడి వేధింపులు మితిమీరడంతో సదరు బాలిక ధైర్యంగా విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వెంటనే అప్రమత్తమైన వారు విశాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌‍లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించించి నిందితుడు షణ్ముఖ్ హితేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 
నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఐటీ యాక్ట్‌లోని సంబంధిత సెక్షన్ల కింద్ కేసు నమోదు చేశారు. నిందితుడుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఏఐ సాంకేతికతను వినియోగించి మైనర్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ నేరాలకు ఈ ఘటన నిదర్శనమని పోలీసులు పేర్కొన్నారు. 
 
పిల్లల  ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ బెదిరింపులు ఎదురైతే వెంటనే పోలీసులన సంప్రదించాలని సూచించారు. ఈ కేసులో  ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 
About Writer
ఠాగూర్