1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 జూన్ 2023 (09:30 IST)

బాలికపై అత్యాచారం... పూర్ణానంద స్వామీజీ అరెస్టు

paripoornananda swamy
రాజమండ్రికి చెందిన అనాథ బాలికపై గత యేడాదిగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చిన విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చిన్న వయసులోనే బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో బాలికను చేరదీసిన బంధువులు ఐదో తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం విశాఖలోని కొత్త వెంకోజీ పాళెంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు. 
 
అక్కడ ఆ బాలికతో స్వామీజీ ఆవులకు మేత వేయించడం, పేడ తీయడం వంటిపనులు చేయిస్తూ వచ్చారు. రాత్రి సమయంలో తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఇలా ఒక యేడాది కాలంగా ఆ బాలికను తన గదిలోనే గొలుసుతో బంధించాడు. ఎదురు తిరిగితే కొట్టేవాడు. రెండు చెంచాల భోజనం మాత్రమే పెట్టి కాలకృత్యాలకు కూడా అనుమతించేవారు కాదని, వారానికి ఒకసారి మాత్రమే స్నానానికి వెళ్లనిచ్చేవారని బాధిత బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ క్రమంలో ఈ నెల 13వతేదీన పనిమనిషి సాయంతో ఆ బాలిక ఆశ్రమ నుంచి బయటపడింది. రైల్వే స్టేషన్‌కు చేరుకుని తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. అక్కడ తనకు పరిచయమైన ఓ ప్రయాణికురాలితో తన బాధను చెప్పుకుంది. ఆ మహిళ తనతో పాటు తీసుకెళ్లి రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ హాస్టల్‌లో చేర్పించేందుకు ప్రయత్నిచంగా, హాస్టల్ నిర్వాహకులు మాత్రం పోలీసుల నుంచి అనుమతి లేఖ తెస్తేనే చేర్చుకుంటామని చెప్పారు. దీంతో ఆ బాలికను వెంటబెట్టుకుని బాలల సంక్షేమ కమిటీకి వెళ్ళి జరిగిన విషయాన్ని వివరించింది. 
 
దీంతో నిర్ఘాంతపోయిన కమీటీ సభ్యులు.. విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు స్వామీజీపై పోక్సో చట్టంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సోమవారం రాత్రి అరెస్టు చేశారు. అయితే, ఆ బాలిక చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అంతా అబద్ధమేనని స్వామీజీ కొట్టిపారేసారు. ఆశ్రమ భూములను కొందరు కొట్టేయాలని చూస్తున్నారని, అందులోభాగంగానే తనపై కుట్ర జరిగిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. కాగా, ఆశ్రమం నుంచి బాలిక అదృశ్యమైనట్టు ఈ నెల 15వ తేదీన ఆశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.