శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: శనివారం, 8 డిశెంబరు 2018 (16:57 IST)

బాబును బోల్తాకొట్టాలని చూసి బోర్లా పడిన బిజెపి నేతలు.. ఎక్కడ?

పొత్తు తెగిపోయిన తరువాత తమను ముప్పు తిప్పలు పెడుతున్న చంద్రబాబును ఇబ్బందిపెట్టాలన్న బిజెపి ఎత్తుగడలు తిప్పుకొడుతున్నాయి. తాజాగా తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేవకర్‌కు స్థానిక నేతలు ఇచ్చిన ఐడియా బెడిసి కొట్టింది. ఇంతకీ బిజెపి చంద్రబాబును ఇరికించడానికి పన్నిన పన్నాగం ఏంటి.. అది వికటించడానికి కారణమేంటి. 
 
బిజెపి - టిడిపిల పొత్తు తెగతెంపులయ్యాక పరస్పరం కారాలు..మిరియాలు నూరుకుంటున్నారు ఇరుపార్టీల నాయకులు. అవకాశం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే ఈ వాగ్యుద్ధంలో టిడిపి పైచేయిగా ఉండటం బిజెపికి మింగుడు పడడం లేదు. వేల కోట్లు నిధులు ఇస్తున్నా ఒక రూపాయి కూడా ఇవ్వలేదంటూ సిఎం చంద్రబాబుతో సహా మంత్రులు ప్రెస్ మీట్లలో కాషాయం పార్టీని ఉతికి ఆరేస్తున్నారు. దీంతో స్థానిక బిజెపి నేతలు ఇస్తున్న కౌంటర్లు అరణ్యరోదనలా మారిపోతున్నాయి. 
 
జాతీయ నాయకుల చేత టిడిపికి గట్టి కౌంటర్ ఇప్పించాలని వేసిన ఓ పన్నాగం తిరుపతిలో బెడిసి కొట్టింది. కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి ప్రకాష్‌ జవదేవకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కేంద్రమంత్రి చేత తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టించారు. మీడియా ముందు చంద్రబాబుతో పాటు టిడిపిపైన తీవ్ర విమర్శలు చేశారు జవదేవర్. అయితే హఠాత్తుగా స్థానిక బిజెపి నాయకులకు ఒక ఐడియా వచ్చింది.
 
చంద్రబాబు అభివృద్థి డొల్లతనాన్ని ఎండగడతామంటూ చేసిన ఆలోచన అసలుకే ఎసరు తెచ్చింది. తిరుపతిలో చిన్నతనంలో చంద్రబాబు చదివిన టిపిపిఎం పాఠశాలలో వసతులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ, ముఖ్యమంత్రి చదివిన పాఠశాలకే దిక్కులేనప్పుడు మిగతా విద్యాసంస్థల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందంటూ నిరూపించే ప్రయత్నం చేశారు బిజెపి నేతలు. ఏకంగా కేంద్రమంతినే టిపిపిఎం పాఠశాల దగ్గరకు తీసుకెళ్ళారు. అయితే అక్కడకు వెళ్ళగానే పాఠశాలలో మౌలిక వసతులన్నీ మెరుగ్గా ఉండటంతో అవాక్కయ్యారు కేంద్రమంత్రి జవదేవకర్. దీంతో అక్కడకు వచ్చిన స్థానిక బిజెపి నేతలపైన ఆగ్రహాన్ని అణుచుకుంటూ మీడియాతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
అలాగే ఏదో అనుకుని మరేదో జరిగిపోవడంతో మిగతా ఇతర బిజెపి నేతలు సందిగ్థంలో పడిపోయారు. అయితే పరువు కాపాడుకునేందుకు నానా తిప్పలు పడి ఎలాగోలా మంత్రితో పాటు ఇతర కాషాయ నేతలు జారుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రమంత్రి చెప్పి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఎపి సిఎంను కేంద్రం టార్గెట్ చేస్తోందనడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు విశ్లేషకులు.