గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: శనివారం, 6 నవంబరు 2021 (20:18 IST)

లోకేష్‌ను చెడగొడుతోంది చంద్రబాబేనా?

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్సి లోకేష్‌ను చంద్రబాబే చెడగొడుతున్నారా..? ఇప్పటికీ చిన్న పిల్లోడులా భావిస్తూ ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా ఉండడం వల్లే లోకేష్ అసమర్థుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారా.. తాజాగా కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకి బాధ్యతలు అప్పగించారు. మరి లోకేష్‌కు ఎందుకు బాధ్యతలు అప్పగించలేదన్న డౌట్ ఇప్పుడు ఆ పార్టీలోనే ఉందట.

 
టిడిపిలో చంద్రబాబు తరువాత నారా లోకేష్‌దే పెత్తనం. అయితే గత కొంతకాలంగా లోకేష్ పార్టీ నిర్ణయాలకు దూరంగా ఉంటున్నట్లు కనబడుతోంది. అధికార పార్టీపై లోకేష్ విమర్సలు గుప్పిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో లోకేష్‌ను చంద్రబాబు ప్రధాన నిర్ణయాలకు దూరంగా పెట్టారట. చంద్రబాబు 30 గంటల దీక్ష లోకేష్‌కు తెలియకుండా చేశారట. సీనియర్ నేతలతో చర్చించిన తరువాతే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని.. కానీ అప్పుడు అందులో లోకేష్ లేడట.

 
తాజాగా కుప్పం మున్సిపాలిటీ నోటిఫికేషన్ విడుదలై చివరకు నామినేషన్లు కూడా వేసేశారు. అయితే రాష్ట్రంలో వాడివేడిగా స్థానిక సంస్ధల ఎన్నికలు జరుగుతున్న వేళ చంద్రబాబు లోకేష్‌ను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయకపోవడంతో ఆ పార్టీ నేతలే చర్చించుకుంటారు.

 
ఏదో ఒక ప్రాంతంలో ఇన్‌ఛార్జ్‌గా లోకేష్‌ను పెడితే బాగుంటుందన్న అభిప్రాయం లేకపోలేదు. అంతేకాదు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనైనా సరే లోకేష్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలే తప్ప వైసిపి నేతలు తిష్ట వేసి మరీ గెలుపు కోసం ప్రయత్నిస్తుంటే బాబు వ్యూహమేంటో అర్థం కాక ఆలోచనలో పడ్డారట టిడిపి నేతలు.

 
పార్టీ పటిష్టమవ్వాలి.. మళ్ళీ పూర్వవైభవం రావాలంటే అందరి సహకారం అవసరం. తన తరువాత వారసుడిగా ఉన్న లోకేష్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించకపోయినా కనీసం పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా చూడాల్సిన బాధ్యత ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఆ పార్టీ నేతల నుంచి.