బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: గురువారం, 29 ఏప్రియల్ 2021 (19:40 IST)

ముదురు పసుపురంగులో మూత్రం వస్తే ఏంటి సమస్య?

సాధారణంగా మనిషి సగటున రోజుకు ఏడుసార్లు మూత్ర విసర్జన చేస్తాడు. ఏడుసార్ల కంటే ఎక్కువగా లేదా తక్కువగా మూత్ర విసర్జన చేస్తే ఏదో తెలియని అనారోగ్యం వున్నట్లే. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన కాలం దాదాపు ఏడు సెకన్ల వరకూ వుంటుంది. మూత్ర విసర్జన చేయాలనిపించినపుడు మూత్రానికి వెళితే రెండు సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయం లోపలే మూత్ర విసర్జన పూర్తయితే వారికి ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పుకోవచ్చు. 
 
మన తీసుకునే ఆహారాన్ని శరీరం వివిధ రకాలుగా విడగొడుతుంది. ఇలా విడగొట్టబడిన ఆహారంలో శరీరం వివిధ పోషకాలను గ్రహించి మిగిలిన వ్యర్థాలను మూత్రం, మల రూపంలో విసర్జిస్తుంది. ఇక మూత్రం రంగును బట్టి ఆరోగ్యాన్ని చెప్పొచ్చు. మూత్రం తెల్లగా స్వచ్ఛంగా ఉంటే శరీరానికి సరిపోయినన్న నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం ఎరుపు రంగులో వస్తే దీనికి కారణం మూత్రంలో రక్తం కలిసి విసర్జితమవ్వడం. ఇది చాలా సందర్భాల్లో యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌గా మారుతుంది. మూత్రం ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తం పోకపోవచ్చు గాని దీన్ని ఒక సమస్యగా తీసుకోవాలి.
 
కొంతమందికి మూత్రం నీలంరంగులో వస్తుంది. ఇది పసిపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని బ్లూ సైపన్ సిండ్రోమ్ అంటారు. ఇది జన్యులోపం కారణంగా వస్తుంది. పెద్దవారిలో ముఖ్యంగా వయాగ్రా వాడే పురుషుల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తుంది. కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రం నలుపు రంగులో ఉంటుంది.
 
మూత్రం జేగురు రంగులో వస్తే చర్మం, మెడ ఇన్ఫెక్షన్ల ప్రభావం కిడ్నీ మీద పడిందని అర్థం. ఇలాంటి పరిస్థితి పిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. యాంటీ బయాటిక్ వాడడం ద్వారా దీని నుంచి బయట పడవచ్చు. డీహైడ్రేషన్‌కు లోనయితే అది ముదురు రంగులోకి మారుతుంది. లివర్ సమస్యలు, కామెర్ల సమస్యలు ఉంటే మూత్రం ముదురు పసుపురంగులోకి వస్తుంది. కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా మూత్రం పసుపు రంగులో వస్తుంది.