1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (10:44 IST)

జిత్తుల మారి చైనా... భూగర్భ నేల మాళిగల్లో కేంద్రాలు

జిత్తుల మారి చైనా తన వైఖరిలో మార్పు చేసుకొనే ఉద్దేశ్యం కనిపించడం లేదు. ఇప్పటికే అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటుండగా డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అణ్వాయుధాల కర్మాగారంగా మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని అధిగమించేందుకు చైనా ఈ భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాల ఏర్పాట్లకు సిద్ధమవుతుండగా.. ఇది అమెరికాకే ప్రమాదం అనుకుంటే.. భారత్‌కు మరీ ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుంది.
 
కాగా భారీ సంఖ్యలో అణ్వాయుధాలను పెంచుకునేందుకు డ్రాగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రయోగ వేదికలను భూగర్భంలో ఏర్పాటు చేసుకుంటుంది.
 
చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో 119 అధునాతనమైన భూగర్భ క్షిపణి వేదికల ప్రయోగ కేంద్రాలను నిర్మిస్తున్నట్లు మోంటెరీలోని జేమ్స్‌ మార్టిన్‌ అణుపరీక్షల నిషేధ అధ్యయన సంస్థకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. 
 
చైనా నిర్మిస్తున్న అత్యధునాతనమైన డీఎఫ్‌-41 అనే పేరున్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులకు నిల్వ కేంద్రాలుగా ఈ నిర్మాణాలను ఉపయోగించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. డీఎఫ్‌-41 క్షిపణుల పరిధి 15,000 కిలోమీటర్లు కాగా ప్రపంచంలో ఏ ప్రాంతాన్నయినా ఇవి ధ్వంసం చేయగలవు.
 
అణ్వాయుధ ఆధిక్యతలో అమెరికా ముందు వరసలో ఉండగా చైనా అమెరికాను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం ఇప్పటికే ఉనికిలో ఉన్న అణ్వాయుధాల వ్యవస్థలో భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా ఈ భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాలను నిర్మిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.