శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (12:57 IST)

అమేజాన్ ఉద్యోగులకు వెసులుబాటు.. వర్క్‌ ఫ్రమ్ హోమ్ పొడిగింపు

ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ తన ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పించింది. తమ సంస్థకు చెందిన కార్పొరేట్‌ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోంను పొడిగించింది. అమెరికా వ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో.. తమ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది.
 
వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం ఉన్నవారు జూన్‌ 30, 2021 వరకు దీనిని వినియోగించుకోవాలని అమేజాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలోని ఈ సంస్థ ఉద్యోగుల్లో 19,000 మందికి కోవిడ్ సోకడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పరిశీలకులు అంటున్నారు. కరోనా కాలంలో కూడా గోదాములను తీసి ఉద్యోగులను ప్రమాదంలోకి నెట్టిందని అమేజాన్‌పై విమర్శలు వెలువడ్డాయి.
 
కరోనా నేపథ్యంలో తొలుత స్పందించి ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించిన అంతర్జాతీయ సంస్థల్లో ట్విట్టర్‌ మొదటిది. ఈ సంస్థ మే నుంచి తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయాలని పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌ కూడా తన ఉద్యోగుల్లో అధికశాతం మందికి శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేసే సదుపాయాన్ని కల్పించింది. 
 
కోవిడ్‌ వ్యాప్తి కారణంగా వర్క్‌ఫ్రం హోమ్‌ చేస్తున్న తమ ఉద్యోగులు మంచి పనితీరు కనబరుస్తున్నట్టు యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తెలిపారు. దాదాపుగా ఏడు నెలల నుంచి గూగుల్‌ సంస్థ కూడా తమ సిబ్బందికి 'వర్క్‌ ఫ్రమ్‌ హోం' అవకాశాన్ని కల్పించింది. కోకోకోలా, స్క్వేర్‌ తదితర ప్రముఖ సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.