శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 18 జనవరి 2018 (14:45 IST)

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు వైరస్ బెడద

ఇటీవలి కాలంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు వైరస్‌ల బెడద ఎక్కువైంది. ఈ వైరస్‌లను నిర్మూలించేందుకు సెక్యూరిటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను విడుదల చేస్తూనే ఉన్నాయి.

ఇటీవలి కాలంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు వైరస్‌ల బెడద ఎక్కువైంది. ఈ వైరస్‌లను నిర్మూలించేందుకు సెక్యూరిటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను విడుదల చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కొత్త కొత్త వైరస్‌లను హ్యాకర్లు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా 'స్కైగోఫ్రీ' అనే ట్రోజన్ వైరస్‌ను ప్రముఖ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై గుర్తించింది. 
 
స్కైగోఫ్రీ ట్రోజన్ వైరస్ గూగుల్ ప్లే స్టోర్ కాకుండా ఇతర వెబ్‌సైట్లలో లభించే నెట్ స్పీడ్ బూస్టర్ యాప్‌ల ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోకి చేరుతుందట. ఇప్పటికే అనేక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు. ఒక్కసారి ఈ వైరస్ ఫోన్‌లోకి ప్రవేశిస్తే ఇక అది ఆ ఫోన్‌కు చెందిన దాదాపు అన్ని సెట్టింగ్స్‌ను, పలు యాప్స్‌ను కంట్రోల్ చేస్తుంది. 
 
ఈ వైరస్ యూజర్‌కు తెలియకుండా యూజర్ ఫోన్‌లో మైక్రోఫోన్‌ను ఆన్ చేసి ఆడియోను రికార్డు చేస్తుంది. ఫేస్‌బుక్ మెసెంజర్, స్కైప్, వైబర్, వాట్సాప్ తదితర యాప్స్‌ను యూజర్‌కు తెలియకుండానే ఓపెన్ చేసి వాటిని నిర్వహిస్తుంది. యూజర్ ఫోన్‌ను అన్‌లాక్ చేసినప్పుడు ముందు కెమెరా ద్వారా యూజర్ ఫొటోను తీస్తుంది. 
 
దీంతోపాటు ఫోన్‌లో ఉన్న కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, క్యాలెండర్ ఎంట్రీలు, ఇతర సమాచారాన్ని సేకరించి హ్యాకర్లకు చేరవేస్తుంది. అందువల్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను వాడే యూజర్లు ఎవరైనా కేవలం గూగుల్ ప్లే స్టోర్ తప్ప ఇతర థర్డ్‌పార్టీ వెబ్ సైట్ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయవద్దని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.