1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (14:13 IST)

అనవసర ఊహాగానాలు వద్దు.. హెలికాఫ్టర్ ప్రమాదంపై ఐఏఎఫ్ ట్వీట్

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి అటవీ ప్రాతంలో భారత తివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ప్రయాణించిన అత్యాధునిక రక్షణ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో రావత్ దంపతులతో పాటు.. మరో 11 మంది మృత్యువాతపడ్డారు. గ్రూపు కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రం 80 శాతం కాలిన గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన చావు బతుకుల మధ్య బెంగుళూరులోని మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ హెలికాఫ్టర్ ప్రమాదంపై రకరకాలైన ఊహాగానాలు వస్తున్నాయి. వీటిపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఘాటుగా స్పందించింది. 
 
"దర్యాప్తు యుద్ధప్రాతిపదిన సాగుతోంది. హెలికాఫ్టర్ ప్రమాదంపై ట్రై సర్వీస్ కోస్ట్ ఆఫ్ ఎక్వైరీని ప్రారంభించాం. ఈ నెల 8వ తేదీన జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం. దర్యాప్తును వేగంగా చేస్తున్నాం. త్వరితగతిన విచారణ పూర్తి చేస్తాం. త్వరలోనే అన్ని వాస్తవాలను బయటపెడతాం. అప్పటిదాకా చనిపోయినవారి గౌరవమర్యాదలను కాపాడండి. అనవసర ఊహాగానాలను ఆపేయండి" అంటూ ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. 
 
మరోవైపు, ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో జరుగనున్నాయి. అంతకుముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు బిపిన్ రావత్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే, రావత్ భౌతికకాయానికి వారు నివాళులు అర్పించారు.