1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 మే 2021 (10:18 IST)

చల్లని కబురు.. జూన్ ఒకటో తేదీ కంటే ముందే నైరుతి రుతుపవనాలు

rains
ఎండవేడిమికి నానా తంటాలు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది నిర్ణీత గడువు అంటే జూన్‌ ఒకటో తేదీ కంటే ముందే వస్తాయని పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హిందూ మహాసముద్రం, దానికి ఆనుకొని అరేబియా సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటమే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు.
 
వచ్చే రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలపై స్పష్టత వస్తుందని ఇస్రోకు చెందిన వాతావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని, అది బలపడి ఆదివారం వాయుగుండంగా మారుతుందని వివరించారు. తరువాత ఉత్తర వాయువ్యంగా పయనించి తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ప్రవేశించి మరింత బలపడి తుఫాన్‌గా మారుతుందని పేర్కొన్నారు.
 
ఇది తుఫాన్‌గా మారిన తరువాత గుజరాత్‌, పాకిస్థాన్‌ తీరం దిశగా పయనిస్తుందని అంచనా వేశారు. తద్వారా ఏపీ, తెలంగాణలో వచ్చే రెండ్రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.