1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (16:41 IST)

జయలలిత సమాధి వద్ద కన్నీరు కార్చిన శశికళ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె శనివారం స్థానిక మెరీనా తీరంలోని జయలలిత, ఎంజీఆర్ స్మారక మందిరాలకు నివాళులు అర్పించారు. అన్నాడీఎంకే పార్టీ స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం జరుగనున్నాయి. దీంతో శశికళ ఒక రోజు ముందుగానే ఈ సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. 
 
ఆ సమయంలో జయలలిత సమాధి వద్ద శశికళ వందలాది మంది అనుచరులతో భారీ ర్యాలీగా చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయలలిత సమాధి వద్ద ఆమె భావోద్వేగంతో కంటతడి పెట్టారు. జయకు నివాళి అర్పించిన శశికళ... కన్నీళ్లను తుడుచుకుంటూ పుష్పాంజలి ఘటించారు.
 
ముఖ్యంగా, శశికళ ప్రయాణించిన వాహనంపై అన్నాడీఎంకే జెండా ఉండటం గమనార్హం. దీనిపై అన్నాడీఎంకే నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తి పార్టీ జెండాను ఎలా పెట్టుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు.
 
ఇదిలావుంటే, జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను పూర్తి చేసుకుని బెంగుళూరు పరప్పణ అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన బెంగుళూరు నుంచి చెన్నైకు చేరుకోగా, ఆయనకు ఆయన మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.