మహారాష్ట్ర- హర్యానాల్లో బీజేపీ గెలుపు - సెన్సెక్స్ జోరు
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో సోమవారం సెన్సెక్స్ భారీ ర్యాలీ దిశగా పయనిస్తోంది. ఈ నెల 15న రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. హర్యానాలో పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించిన బీజేపీ, మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం చేపట్టేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ ప్రభావం సెన్సెక్స్పై కూడా పడింది.
మరోవైపు, దాదాపు ఐదేళ్ల తర్వాత డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. అంతేగాక, డీజిల్ ధరలపై మోడీ సర్కారు నియంత్రణను సడలించింది. దీంతో, సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ భారీ ర్యాలీ దిశగా పయనించింది. బ్యాంకింగ్, కేపిటల్ గూడ్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. దీంతో, ప్రారంభ సమయంలోనే సెన్సెక్స్ 400 పాయింట్ల మేర పురోభివృద్ధి సాధించింది. ఈ ర్యాలీ ఇంకా కొనసాగుతోంది.