1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (09:25 IST)

"ఏం జిట్టా బాలకృష్ణ.. ఉద్యమం అనేది మనకు అలవాటైన పనేగా" "" కేసీఆర్ కామెంట్స్

kcrao
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ఉద్యమబాటపట్టనున్నారు. కృష్ణానదిపై ఉన్న నీటి ప్రాజెక్టులను కేంద్రం తన ఆధీనంలోకి కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకుంది. దీన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టులను తిరిగి రాష్ట్ర పరిధిలోకి తెచ్చుకునేందుకు వీలుగా ఆయన మళ్లీ ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నంది నగర్‌లోని తన నివాసంలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, పాలమూరు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఇందులో కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలు చేసి ఇక్కడిదాకా వచ్చామన్నారు. కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనాన్ని అడ్డుకునేందుకు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దామని ఆయన వ్యాఖ్యానించారు. 
 
'ఏం జిట్టా బాలకృష్ణ.. ఉద్యమం అనేది మనకు అలవాటైన పనేగా.. రవీందర్ సింగ్, తల్వార్ సిద్ధం కావాలె. కృష్ణా నదీ జలాలపై తెంలగాణ హక్కులను కాపాడడం కోసం ఎంతకైనా పోరాడదాం' అని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 'ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే మన అడుక్కోవాల్సిందేనని, దీన్ని అడ్డుకునేందుకు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దా'మని ఆయన పిలుపునిచ్చారు. 
 
నల్గొండలో ఈ నెల 13వ తేదీన తలపెట్టిన భారత రాష్ట్ర సమితి సభను అడ్డుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారని, నల్గొండ ఆయన జాగీరా అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లను చాలా మందిని చూశానని అన్నారు. 'ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడుతారు. నల్గొండలో మనం పోరాటం చేద్దాం. మనం తక్కువేం లేం. 39  మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. రేవంత్ రెడ్డివి పిల్ల చేష్టలు. పాలన చేతకాక నా మీద కారు కూతలు కూస్తున్నడట. సీఎం అనెటోళ్లు ఎవరైనా ఈ రోజు ఉంటరు. రేపు పోతరు. తెలంగాణ ప్రాయోజనమే మనకు ముఖ్యం' అని వ్యాఖ్యానించారు. పైగా, 'ఈ ప్రభుత్వాన్ని మనం కూల్చనక్కర్లేదు.. గడ్డపారలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాళ్లే కొట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చుకుంటరు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తారని' మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు.