తెలంగాణాలో భారీ వర్షం : పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడొచ్చని పేర్కొంది.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు తెలిపిన వాతావరణ శాఖ అధికారులు.. కామారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, బుధవారం వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు, హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తీవ్రతకు రామ్నగర్లోని వీఎస్టీ రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది. అలాగే, హైదర్గూడలోనూ ఓ భారీ వృక్షం నేలకొరగడంతో ట్రాఫిక్జామ్ ఏర్పడింది. పలుచోట్ల రహదారులపై వర్షం నీరు చేరింది. ముషీరాబాద్లో ఈదురు గాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది.
