1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Mercury Over 43ºC for First Time in Hyderabad

హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలిసారిగా ఉష్ణోగ్రత 43 డిగ్రీల మార్కు

Summer
తెలంగాణలో ఈ ఏడాది తొలిసారిగా ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటింది. తెలంగాణలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన వడగాలుల పరిస్థితులతో సతమతమవుతూనే ఉన్నాయి. కనీసం 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల పైన నమోదవ్వగా, పలు మండలాల్లో అవి 46డిగ్రీల మార్కును కూడా దాటాయి. 
 
హైదరాబాద్‌లో, కార్వాన్ ప్రాంతంలో అత్యధికంగా 43.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, అంబర్‌పేటలో ఉష్ణోగ్రత 43డిగ్రీలకి చేరింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో, పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 42డిగ్రీల పైనే కొనసాగింది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం, పెద్దపల్లిలోని ముత్తారం, సూర్యాపేటలోని మునగాలలో రాష్ట్రంలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలలో 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో తీవ్రమైన వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జయశంకర్, కుమరం భీమ్, మంచిర్యాల జిల్లాల్లో కూడా తీవ్రమైన వడగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. 
 
మధ్యాహ్న వేళల్లో నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలని, తగినంత నీరు తాగాలని, వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించాలని, బయట చేసే శారీరక శ్రమతో కూడిన పనులకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. వృద్ధులు, పిల్లలు, డెలివరీ సిబ్బంది, అనారోగ్య సమస్యలు ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వందరూపాయలతో మ్యాగీ, కూల్‌డ్రింక్స్‌తో బర్త్ డే చేసుకున్న బాలుడు.. వీడియో వైరల్