గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మే 2021 (16:06 IST)

కరీంనగర్‌ సెషన్స్ కోర్టును ప్రత్యేక కోర్టుగా గుర్తించాలని విజ్ఞప్తి

న్యాయవాది వామన్‌ రావు హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి లేఖ రాశారు. కరీంనగర్‌ సెషన్స్ కోర్టును.. ప్రత్యేక కోర్టుగా గుర్తించాలని.. విచారణ వేగంగా జరిగేలా చూడాలని ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 
 
న్యాయవాది దంపతులు వామన్‌రావు, నాగమణిని పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద మధ్యాహ్నం నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యారు. కారులో ప్రయాణిస్తున్న దంపతులను ప్రత్యర్థులు కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. ఈ కేసులో పులువురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కుంట శ్రీను, కుమార్, చిరంజీవి నిందితులుగా ఉన్నారు. 
 
తమ పనులకు అడ్డుపడుతున్నారనే హత్యచేశామని నేరాన్ని అంగీకరించారు. గతంలోనే సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్ష్యులను విచారించి మెజిస్ట్రేట్‌ సమక్షంలో వాంగ్మూలాలను నమోదు చేశారు. 
 
ఈ కేసులో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధుపైనా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది.