శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (21:18 IST)

దేశానికి సేవ చేయాలని వస్తే హైదరాబాద్ ఫుట్ పాత్ పైన పడుకోబెట్టారు...(Video)

దేహమంతా దేశభక్తి నింపుకున్న యువకులు. దేశానికి సైనికులుగా పనిచేయాలన్నది ఆ యువకుల జీవిత ఆశయం. అదే వారి సంకల్పం. అందుకోసం దేశంలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికొచ్చారు యువకులు. ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం వచ్చిన అభ్యర్థుల అవస్థలు వర్ణనాతీతం. చేతిలోని డబ్బంతా ఖర్చైపోవడంతో ఆకలిదప్పులతో అల్లాడుతున్నారు ఆర్మీ అభ్యర్థులు.
 
సరిహద్దుల్లో సైనికులుగా ఉద్యోగం సాధించాలనే ఆశయం ఈ యువకుల్ని హైదరాబాదుకు రప్పించింది. ఆర్మీలో ఉద్యోగాల కోసం రాజస్థాన్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి దాదాపు 2 వేల మంది అభ్యర్థులు హైదరాబాదుకు వచ్చారు. మౌలాలిలోని ఆర్మీ రిక్రూట్మెంట్‌లో సెలక్షన్ అయి ఇంటికి తిరిగి వెళ్లాలనేది ఈ యువకుల పట్టుదల. మూడ్రోజుల క్రితం హైదరాబాదుకు వచ్చిన అభ్యర్థులు ఇక్కడ బస చేయడానికి చాలినన్ని డబ్బుల్లేక ఇలా రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపైనే చేరారు. 
 
కప్పుకోవడానికి దుప్పట్లు కూడా సరిగా లేకపోవడంతో.. ఒక దుప్పట్లో ఇద్దరు, ముగ్గురు ముడుచుకోవాల్సిన దుస్థితి. గజగజ వణికించే చలిలో ఇబ్బందులు పడ్తున్నారు ఆర్మీ అభ్యర్థులు. నిరుపేద వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారమని.. కూలీ పనులతో సంపాదించిన డబ్బంతా ఖర్చైపోయిందని వాపోతున్నారు అభ్యర్థులు. కడుపు మాడుతుంటే.. నీళ్లు తాగి ఆకలి మంటల్ని చల్లార్చుకుంటున్నారు అభ్యర్థులు. 
 
కష్టాలు చుట్టుముట్టినా పంటిబిగువుతో భరిస్తూ.. ఆర్మీ రిక్రూట్మెంట్లో ఉద్యోగం సాధించాలని ఫుట్ పాత్‌లపై ఉన్న వీరికి కొందరు దాతలు అన్నం పెట్టి ఆదుకుంటున్నారు. అయితే వేలల్లో అభ్యర్థులు ఉండటంతో అందరికీ భోజనం పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు దాతలు.
ఆర్మీ అధికారులు, స్వచ్చంద సంస్థలు మానవత్వంతో స్పందించి తమకు ఆశ్రయం కల్పించాలని వేడుకుంటున్నారు అభ్యర్థులు. వీడియో చూడండి.