1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (18:34 IST)

టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన విజయశాంతి.. హుజురాబాద్‌లో ఓటమి ఖాయం

టీఆర్ఎస్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి నిప్పులు చెరిగారు. నాయకులను కొనుగోలు చేసి, బీజేపీ కార్యకర్తలను ఒత్తిళ్ళకు గురి చేసే విధంగా కేసులు, వేధింపులు చేపట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులను చేసి, ఎలాగైనా గెలవాలన్న దుర్మార్గపు ఆలోచనలో భాగంగానే ఈ పలాయనవాదాన్ని ప్రస్తుతానికి అడ్డు పెట్టుకున్నట్లు ఉందని విజయశాంతి విమర్శించారు. ఇప్పటిదాకా చేసిన, చేస్తున్న అరాచక కార్యాచరణ వల్ల టీఆర్ఎస్ ఇప్పటికే ఆ నియోజకవర్గంలో నైతిక ఓటమి పాలైందని విజయశాంతి ఆరోపించారు.
 
హుజురాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని విజయశాంతి జోస్యం చెప్పారు. ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సంసిద్ధతపై ప్రశ్నిస్తే తమ వల్ల కాదని కేసీఆర్ ప్రభుత్వం తప్పించుకుని మంచి గాలప్ మీద భాగ్ మిల్కా లెక్క ఉరుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయని విమర్శించారు. 
 
జనం దృష్టిలో తేలికైపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం మరింత నవ్వుల పాలు కాక తప్పదని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు.. టీఆర్ఎస్ ఓటమి ఖాయమని అన్నారు.
 
గతంలో కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎంత చెప్పినా వినకుండా మిలియన్ల సంఖ్యలో ఓటర్లు పాల్గొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇప్పుడు కేవలం 100కు పైన ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేయాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పించుకుని వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం హుజురాబాద్ ఎన్నిక వస్తుందన్న భయంతోనే ఆయన ఇలా చేస్తున్నామని విమర్శించారు.